ఢిల్లీ వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయభేరి మ్రోగించి సిరీస్ ను 3-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చివరి రోజు టీ విరామ సమయం వరకు గట్టిపోటీ ఇచ్చిన సఫారీ బ్యాట్స్ మెన్లను ఉమేష్ యాదవ్, అశ్విన్ లు పెవిలియన్ బాట పట్టించారు. టీ విరామ సమయానికి 125/5 వికెట్లతో ఎదురీదుతున్న దక్షిణాఫ్రికా చివరి 5 వికెట్లను 31 బంతుల తేడాలో చేజిక్కించుకున్నారు.
దాదాపు 50 ఓవర్లను ఎదుర్కొన్న డివిలియర్స్ 43 పరుగులు చేయగా, సఫారీ జట్టు మొత్తంగా 143.1 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 337 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు సాధించి, భారత్ విజయానికి ప్రధాన కారణమైన రెహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, సిరీస్ లో మొత్తం 31 వికెట్లను సొంతం చేసుకున్న అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతమైంది.
ఇటీవల కాలంలో వరుసగా వైఫల్యాలు చవిచూస్తున్న టీమిండియాకు ఈ విజయం ఊరటనిచ్చే అంశం. అందులోనూ వరల్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి సఫారీ జట్టును 3-0 తేడాతో ఓడించడం కోహ్లి నాయకత్వాన్ని మరింత బలపరుస్తోంది. ధోని నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా కోహ్లి తయారవుతున్నాడని క్రీడా పండితులు కొనియాడుతున్నారు.





