లైట్ తీసుకుంటే పరిస్థితి మరింత టైట్ అవుతుంది..!

India ready for crucial Zimbabwe T20 series

కొద్ది నెలల క్రితం వరకు టీ20ల్లో టీమిండియా అంటే ప్రత్యర్థి జట్లకు భయమే. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్ వంటి ఆటగాళ్లతో జట్టు అజేయ శక్తిలా కనిపించింది. అదే జోరుతో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకుంది. అప్పట్లో భారత జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదనిపించింది.

అయితే ప్రపంచకప్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచకప్ విజేత కెప్టెన్ ను వెంటనే మార్చేయటం, టోర్నీలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ను మూడు ఇన్నింగ్స్‌ల వైఫల్యం తర్వాత బెంచ్‌ కు పరిమితం కావడం ఎన్నో చర్చలకు దారితీశాయి. కారణాలు ఏవైనా, కొత్తగా రూపుదిద్దుకున్న భారత జట్టు మాత్రం తన లయను పూర్తిగా కోల్పోయింది. అప్పటి నుంచి పరాజయాల పరంపర మొదలైంది.

ADVERTISEMENT

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా టీ20 చరిత్రలో ఎన్నడూ చూడని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి, ఏడు మ్యాచ్‌లుగా విజయమే లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ ఏ విభాగం కూడా ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ గణాంకాలే ప్రస్తుతం భారత అభిమానులను కలవరపెడుతుంది.

ప్రస్తుతం భారత జట్టు ముందు ఉన్న తదుపరి సవాల్ ‘జింబాబ్వే’. ఒకప్పుడు అరుదుగా మాత్రమే విజయాలు సాధించే జట్టుగా ఉన్న జింబాబ్వే, ఇప్పుడు ఎవరినైనా ఆశ్చర్యపరచవచ్చు అనే స్థానాన్ని సంపాదించుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి తమ సత్తా చాటింది. కాబట్టి ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే భారత్ ఈ ప్రత్యర్థిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు.

ఈ సిరీస్‌లో అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే నిలువనుంది. భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన అతడు ఇప్పటివరకు ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 20 పరుగుల మార్కును అందుకోలేదు. ప్రతిభ ఉన్నా, దానిని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించాల్సిన అవసరం లేకతప్పదు.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస పరాజయాల తర్వాత అతని వ్యూహాలు, నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టును కష్టకాలం నుంచి బయటపడేయడం ఇప్పుడు అతని ముందున్న అతిపెద్ద బాధ్యత. ఈ సిరీస్ అతని నాయకత్వానికి కీలక మలుపు కావచ్చు.

టీమిండియా పరాజయాల పరంపరను ఆపాలంటే అన్ని విభాగాలు ఒకేసారి రాణించాల్సిందే. కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడితే విజయాలు సాధించడం కష్టమే. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడంతో పాటు సీనియర్లు కూడా తమ అనుభవాన్ని జట్టుకు ఉపయోగపడేలా మార్చాలి. అప్పుడే జట్టు మళ్లీ విజయాల బాట పట్టే అవకాశం ఉంటుంది.

జింబాబ్వే సిరీస్ ఇప్పుడు కేవలం మరో ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా పునరాగమనానికి తొలి అడుగు కూడా. వైభవ్ బ్యాటింగ్‌లో, శ్రేయస్ కెప్టెన్సీలో, భారత జట్టు విజయాల్లో తిరిగి తమ మార్క్ చూపించాల్సిన సమయం ఇదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విమర్శలకు సరైన సమాధానం ఇవ్వగలరు. లేకపోతే భారత టీ20 జట్టుపై ప్రశ్నలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories