వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను హటాత్తుగా వైసీపీకి, పజెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవికి రాజీనామా చేసి టీడీపిలో చేరడం విజయనగరం జిల్లా వైసీపీలో కలకలం సృష్టించింది.
జిల్లా వైసీపీలో బొత్స తర్వాత రెండో స్థానంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసినందున చిన్న శ్రీను నిష్క్రమణ ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.
ఆయన వైసీపీలో తనకంటూ ప్రత్యేకంగా అనుచరులను, కార్యకర్తలను తయారు చేసుకున్నారు. కనుక వారందరూ కూడా ఆయనతో పాటు టీడీపిలోకి తరలిపోవడం ఖాయమే. బహుశః అందుకే బొత్స సత్యనారాయణ ఆందోళన చెందుతున్నట్లున్నారు.
అయితే చిన్న శ్రీను చేరిక టీడీపికి ఆ మేరకు రాజకీయంగా లభ్ది కలిగించినప్పటికీ, జిల్లాలోని టీడీపి శ్రేణులను తీవ్ర అసంతృప్తికి, అసహనానికి కూడా గురి చేయడం ఖాయం.
తాము ఇంతకాలం ఎవరితో పోరాడామో, వారిని పార్టీలో చేర్చుకోవడం టీడీపి నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఈ షాక్ నుంచి వారు తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది.
కనుక వారి బాధ, ఆక్రోశం ఇంకా బయటపడలేదు. బయటపడతారో లేక చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని గౌరవించి చిన్న శ్రీను నాయకత్వంలో పనిచేయడానికి సర్దుకుపోతారో త్వరలో తెలుస్తుంది.
ఇక చిన్న శ్రీనుకి కూడా జిల్లాలో టీడీపి శ్రేణులను కలుపుకుపోవడం చాలా కష్టమే. కూటమి ప్రభుత్వంలో టీడీపి, జనసేన రెండున్నరేళ్ళుగా కలిసి పనిచేస్తున్నప్పటికీ, నేటికీ ఆ రెండు పార్టీల కార్యకర్తల మద్య నేటికీ సఖ్యత, సమన్వయము ఏర్పడనే లేదు. వారిమధ్య తరచూ చిన్నపాటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
అలాంటప్పుడు ఇంతకాలం బద్ధ శత్రువుల్లా పోరాడుకున్న జిల్లాలోని వైసీపీ-టీడీపి శ్రేణులను కలపడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. కనుక ఇల్లు అలకగానే పండుగ కాదు. పార్టీ మారగానే పరిస్థితి మారిపోదు.





