ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు ఆయన ప్రధాని మోడీని నిందిస్తూ ఏ విధంగా మాట్లాడారో బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాను ప్రధాని మోడీ తీరును, ఆయన విధానాలను విమర్శిస్తుంటాను కనుకనే ‘సర్’ పేరుతో తన ఓటును జాబితా నుంచి ప్రధాని మోడీయే తొలగింపజేశారన్నట్లు మాట్లాడారు. కనుక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ప్రకాష్ రాజ్ అసందర్భపు మాటలు మాట్లాడారు.
అయితే దేశంలో ఆయన ఒక్కరికే కాదు.. సినీ, క్రీడా, వ్యాపార తదితర అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాయి. వారు ఆ నోటీసులను హుందాగా స్వీకరించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, సమంత, వెంకటేష్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
అలాగే ప్రముఖ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణి సైనా నెహ్వాల్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నిర్వహిస్తున్న రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, ప్రముఖ పారిశ్రామికవేత్త దివి మురళీకృష్ణ ప్రసాద్ ఇంకా పలువురికి ‘సర్’లో భాగంగా నోటీసులు జారీ చేసింది.
అయితే నోటీసులు అందుకున్న ఈ సెలబ్రిటీలు ఎవరూ దీనిని పెద్ద సమస్యగా లేదా వివాదంగా భావించడం లేదు. తమపై ఎవరో కక్షపూరితంగా ఈ నోటీసులు పంపించారని ఆరోపించడం లేదు.
ఇవి కేవలం ‘సర్’ ప్రక్రియలో భాగంగా వివరణ, ధ్రువీకరణ పత్రాలు కోరుతూ పంపిన నోటీసులుగా మాత్రమే చూస్తున్నారు.
కనుక ఎన్నికల సంఘం సూచన ప్రకారం, అది కోరిన వివరాలు, పత్రాలు సమర్పించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు తప్ప ఎవరూ ప్రకాష్ రాజ్లా ప్రధాని మోడీని నిందించడం లేదు. ఎన్నికల సంఘం కూడా వారి బిజీ షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని వారు స్వయంగా రావాల్సిన అవసరం లేదని తమ ప్రతినిధులను పంపినా పర్వాలేదని వెసులుబాటు కల్పించింది.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు.. బీజేపీని, ప్రధాని మోడీని, ఆయన పాలనను ద్వేషించే ప్రకాష్ రాజ్కు ‘సర్’ నోటీసు వెనుక కూడా ప్రధాని మోడీనే కనిపించారు తప్ప మిగిలిన ప్రముఖుల్లా వాస్తవం చూడలేకపోయారు. ప్రకాష్ రాజ్ అంతటి లోకజ్ఞానం, అనుభవం ఉన్న ప్రముఖుడు ఆవిధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యమే కదా?





