బెంగళూరులో ఓ డెలివరీ బాయ్ ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.
మైనర్ బాలికని వేధించినందుకు పోక్సో కేసు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఆమెని, ఆమె నాన్నమ్మని, ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య, ఇద్దరు పిల్లలని నరికి చంపాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి మంగళవారం రాత్రి క్యాబ్లో శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతున్నప్పుడు, దారిలో కారు ఆపి క్యాబ్ డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేయబోయాడు.
ఈ మూడు ఘటనలను గమనిస్తే మహిళలు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా రక్షణ లేదని స్పష్టమవుతోంది. ఇంట్లోని భద్రత లేక, పనిచేసే చోట భద్రత లేక, రోడ్డుపై కూడా భద్రత లేకపోతే ఇక మహిళలు ఎలా బ్రతకాలి? ఎక్కడ బ్రతకాలి?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి.
పోలీసులు కూడా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళల రక్షణ కొరకు ప్రత్యేకమైన మొబైల్ యాప్స్ వంటివి అందుబాటులోకి తెచ్చారు. అయినా కూడా దేశంలో ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
కనుక రాత్రిపూట లేదా ఒంటరిగా క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రతకు మహిళా క్యాబ్ డ్రైవర్లను ప్రోత్సహించడం, మహిళల కోసం ప్రత్యేకంగా అటువంటి స్కూటీ, ఆటో, క్యాబ్స్ సర్వీసులు ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపట్టడం వంటి చర్యలు చేపట్టడం చాలా అవసరం.
అలాగే ప్రభుత్వాలు, పోలీసులు, ఇలాంటి సేవలు అందిస్తున్న ఊబార్, ఓలా, రాపిడో వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.
ఎందుకంటే, ఇలాంటి హేయమైన నేరాలు జరిగిన తర్వాత నిందితులని పట్టుకొని శిక్ష పడేలా చేసినా, బాధిత మహిళల ప్రాణాలు తిరిగి రావు. వారు మునుపటిలా జీవించలేరు. ఇలాంటి నేరాలు వారి జీవితాలతో పాటు వారి కుటుంబాలను కూడా చిద్రం చేస్తాయి కనుక.






