తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో కీలక ఘట్టం చోటు చేసుకుంటోంది. రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్పడ్డ ఏపీకి కేపిటల్ గా గుంటూరు జిల్లా పరిధిలోని తుళ్లూరు పరిసరాల్లో అమరావతి పేరిట నూతన రాజధానిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించి, అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ నెల 27వ తేదీన పలు శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు విజయవాడ, గుంటూరులకు తరలి వెళ్లగా… నేటి మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కానుంది.
ఈ మేరకు తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులోనే నూతన రాజధానిలో ఏపీ సచివాలయానికి అంకురార్పణ జరగనుంది. నవ్యాంధ్రలో కీలక ఘట్టంగా పరిగణిస్తున్న ఏపీ పాలన కార్యక్రమాలు ఏపీ భూభాగానికి మారుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేకుండా జరుగుతుండటం విశేషం. దీంతో ఈ కార్యక్రమం నలుగురు మంత్రులు, హైదరాబాద్ నుంచి తరలి వస్తున్న 200 మంది సెక్రటేరియట్ ఉద్యోగులు, ఇప్పటికే విజయవాడ, గుంటూరుల్లో ఏర్పాటైన కార్యాలయాల సిబ్బంది సమక్షంలో జరగనుంది. వీరి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా 11 బస్సులను ఏర్పాటు చేసింది.
కొత్త సచివాలయంలో పాత ఫర్నీచర్ ను ఏ మాత్రం వాడరాదని సచివాలయం, ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా వచ్చే నెల 21లోగా సెక్రటేరియట్ లోని అన్ని శాఖల ఉద్యోగులు అమరావతికి తరలి రావాల్సిందేనని కూడా సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



