జగన్ అక్రమాస్తుల కేసులలో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ అభ్యర్దిగా ఇటీవల నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్ని కేసులు ఎదురైనా, తనను వీడిపోలేదు గనుకనే విజయసాయికి రాజ్యసభను కేటాయించినట్లు నామినేషన్ రోజు జగన్ స్వయంగా ప్రసంగించారు. అయితే ఇన్ని కేసులలో ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని అసలు రాజ్యసభకు ఎలా పంపిస్తారు? వైసీపీ నేతలకు రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్రంలో నేతలు లేరా? ఇలాంటి వారిని రాజ్యసభకు పంపితే ఏపీపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాము? అంటూ ఏపీ సిఎం చంద్రబాబు మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి లాంటి వారికి అడ్డుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో కలకలం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తెరవెనుక ‘రాజ్యసభ రాజకీయం’ రంజుగా సాగుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డి విజయం సాధించాలంటే 36 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడాలి. ప్రస్తుతం ఉన్న బలానికి విజయసాయిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే. కానీ, ఏ2 నిందితుడిని రాజ్యసభకు వెళ్ళకుండా అడ్డుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ వర్గం మరింత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన జగన్, మరి తాజా పరిణామాలతో ఇంకాస్త పకడ్భందీ వ్యూహం అమలు చేస్తారేమో చూడాలి. ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు నాలుగో అభ్యర్ధిపై ఎందుకు ప్రకటన చేయలేదు. అంతేకాక, పార్టీలో చేరిన అభ్యర్ధులే నాలుగో అభ్యర్ధిని నిర్ణయిస్తారని చెప్పాడం… అలాగే రేపు జరగబోయే దానికి ఇప్పుడే నిర్ణయం ఏం చెబుతామని నవ్వుతూ వ్యాఖ్యానించడం… అనేది దేనికి సంకేతాలు? చంద్రబాబు తీరు వైసీపీ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని పొలిటికల్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.





