అంతరిక్షంలో భారత్‌ స్పేస్ స్టేషన్… ఊహించగలమా?

ISRO

అంతరిక్ష ప్రయోగాలలో భారత్‌ ప్రపంచం అగ్రదేశాల సరసన నిలపడమే కాదు… వాటి కంటే చాలా తక్కువ ఖర్చుతో విజయవంతంగా ఉపగ్రహాలను పంపిస్తూ అంతరిక్ష వ్యాపారంలో భారత్‌ను నంబర్: 1 స్థానంలో నిలిపింది ఇస్రో. అందుకే ఇప్పుడు అమెరికాతో సహా పలు అగ్రదేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఇస్రోని ఆశ్రయిస్తున్నాయి.

ఇస్రో వ్యాపారం అంతరిక్షంలోకి దూసుకుపోతుండటంతో, తమిళనాడులోని తూత్తుకొడి జిల్లాలోని కులశేఖరపట్టియణం వద్ద 2,292 ఎకరాలలో మరో అంతరిక్ష ప్రయోగ కేంద్రం నిర్మించేందుకు ప్రధాని మోడీ నిన్న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సరికొత్త అంతరిక్ష ప్రయోగ కేంద్రం కొరకు కేంద్ర ప్రభుత్వం రూ.986 కోట్లు కేటాయించింది.

ADVERTISEMENT

మరో విశేషమేమిటంటే ఎటువంటి సౌకర్యాలు లేని అక్కడ నుంచే ఇస్రో శాస్త్రవేత్తలు నిన్న మధ్యాహ్నం ఓ సౌండింగ్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించారు కూడా. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ అంతరిక్ష కేంద్రం నుచి తొలి ఉపగ్రహం ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాధ్ చెప్పారు.

ఇక్కడ నుంచి ఏడాదికి 24 చిన్న ఉపగ్రహాలు ప్రయోగించగల సామర్ధ్యంతో ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు సోమనాధ్ చెప్పారు. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ అంతరిక్ష కేంద్రం సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.

ఇస్రో నిర్మాణాలు, ప్రయోగాలు విఫలమైతే వార్త అవుతుంది కానీ విజయవంతమైతే అది చాలా సాధారణవిషయమే. అంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఇస్రోకే సొంతం.

భారతీయులు కలలో కూడా ఊహించలేని మరో గొప్ప అద్భుతానికి ఇస్రో సన్నాహాలు మొదలుపెట్టింది. నిన్న నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (స్పేస్ స్టేషన్) నమూనాని విడుదల చేసింది.

ఇది 2025 నాటికి పరీక్షల దశకు చేరుకుతుందని, 2028 నాటికి అంతరిక్షంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2035 నాటికి ఇది అంతరిక్షంలో ఉంటుందని ఇస్రో ప్రకటించింది.

భారత్‌కు సొంతంగా అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం, దానిలో మన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఉంటూ పరిశోధనలు చేస్తుండటం ఎన్నడైనా ఊహించామా? ఈ కలని ఇస్రో సాకారం చేసి చూపబోతోంది.

ADVERTISEMENT
Latest Stories