అభివృద్ధి చేసినా లెక్కలు, సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుంటే…

Jagan Chandrababu Naidu AP Assembly

తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 9 ఏళ్ళలో కేసీఆర్‌ ఎంతగా అభివృద్ధి చేశారో కళ్ళకు కనబడుతూనే ఉంది. అయినప్పటికీ ప్రజలు ఎందుకో ఆయనని వద్దనుకొని కాంగ్రెస్‌కు పగ్గాలు అప్పజెప్పారు. ఇంతకాలం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఎంతగా అప్పులపాలు చేశారో, వాటితో వివిద శాఖలు, సంస్థలను ఎంతగా నిర్వీర్యం చేశారో, కేసీఆర్‌ వద్ద పనిచేసిన అధికారులు స్వయంగా ఇచ్చిన గణాంకాలతోనే శ్వేతపత్రాలు తయారుచేసి శాసనసభలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పాలకులు ఎండగడుతున్నారు.

ADVERTISEMENT

తెలంగాణ మేలిముసుగుని తొలగించి వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌ పాలకుల నుంచి బిఆర్ఎస్‌ నేతలు ఇటువంటి ఎదురుదాడి ఊహించలేదు. అయినా ఎవరూ తడబడటం లేదు. వారి ఆరోపణలకు భయపడటం లేదు. ఎందుకంటే వారి వద్ద అన్నిటికీ బలమైన సమాధానం ఉంది. అదే… తెలంగాణ అభివృద్ధి!

కేసీఆర్‌ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పుల గురించి కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు కూడా గణాంకాలతోనే ధీటుగా సమాధానాలు చెపుతున్నారు. తమ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గట్టిగా, ధైర్యంగా చెప్పుకొంటున్నారు. ఇది కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవమే కనుక వారు అంత ధైర్యంగా, నిబ్బరంగా కాంగ్రెస్‌ మంత్రులను ఎదుర్కోగలుగుతున్నారు.

రేపు ఏపీలో ప్రభుత్వం మారి టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చినప్పుడు వారు కూడా జగన్‌ ప్రభుత్వం చేసిన ఈ లక్షల కోట్ల అప్పుల లెక్కలు తీసి శాసనసభలో నిలదీస్తే జగన్మోహన్‌ రెడ్డి, ఆయన మంత్రులు చెప్పుకోవడానికి ఏమైనా సమాధానం ఉందా?

లక్షల కోట్లు అప్పులతో ఏం చేశారని కాంగ్రెస్‌ పాలకులు కేసీఆర్‌ని ప్రశ్నిస్తున్నట్లే, రేపు టిడిపి, జనసేనలు శాసనసభలో ప్రశ్నిస్తే జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు చూపేందుకు ఏపీలో వారు చేసిన అభివృద్ధి పనులు ఏవైనా ఉన్నాయా?

ఋషికొండ ప్యాలస్ కాకుండా రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏవైనా ఉన్నాయా?అని వైసీపి నేతలు ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో?

కాంగ్రెస్‌ పాలకులు అడుగుతున్న ప్రతీ ప్రశ్నకు బిఆర్ఎస్‌ నేతల వద్ద పక్కా లెక్కలతో ఆధారాలు చూపుతున్నారు. మరి వైసీపి మంత్రుల వద్ద లెక్కలు ఉన్నాయా?

తెలంగాణ అభివృద్ధి కళ్ళకు కనిపిస్తున్నా బిఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు సంజాయిషీలు, సమాధానాలు చెప్పుకోవలసి వస్తోంది. కానీ దేవతా వస్త్రాలలా కంటికి కనిపించని ‘ప్రజలకు చేసిన మేలు’ని ఎలా చూపగలరు?ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories