వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆయనకు సరైన భద్రత కల్పించకుండా ప్రభుత్వం ఏదో పెద్ద కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాశారు.
ఇందుకు నిదర్శనంగా ఇటీవల విజయవాడ-గుంటూరు-ఇబ్రహీంపట్టణం పరామర్శ యాత్రలతో పాటు ఇదివరకు యాత్రలలో జరిగిన ఘటనలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే పోలీస్ అధికారులు హటాత్తుగా తమ అధినేత రూట్ మ్యాపును మార్చేశారని లేఖలో ఆరోపించారు.
బాగా రద్దీగా ఉండే ప్రాంతాల గుండా జగన్ పరామర్శ యాత్ర సాగేలా చేయడం వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు వైసీపీ అనుమానం వ్యక్తం చేశారు. కనుక ఈ భద్రతాలోపాలు, రూట్ మ్యాపులో ఆకస్మిక మార్పులపై విచారణ జరిపించాలని కోరారు. ఇక నుంచి ఖచ్చితంగా జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ లేఖలో హోంశాఖను కోరారు.
పోలీసులు వారిస్తున్నా పరామర్శ యాత్రలలో కూడా వేలాదిమందితో జగన్ బలపదర్శన చేస్తూనే ఉన్నారు. వాటిలో వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా ప్రత్యర్ధుల తలకాయలు నరుకుతామని’ ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శిస్తుంటారు. వైసీపీ జెండాలు పట్టుకొని రోడ్లపై బైక్ విన్యాసాలు చేయడం, రక్తంతో జగన్ ఫోటోలకి బొట్లు పెడుతూ అందరినీ భయపెడుతూనే ఉంటారు. పోలీసులు వారిస్తున్నా రద్దీగా ఉండే ప్రాంతాల గుండా సాగుతుంటారు.
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఈ ధోరణిని ప్రశ్నిస్తే, మా అధినేత జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వస్తే ఎందుకు భయపడుతున్నారని వైసీపీ సీనియర్ నేత రోజా నిలదీస్తారు.
కనుక భద్రత ఎవరికి అవసరం? జగన్కా? లేదా ఆయన బలప్రదర్శనలు, రాప్పారప్పాలు చూసి భయపడుతున్న ప్రజలకా?
ప్రజలను, ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను కూడా భయపెడుతున్న జగన్కి, భద్రత తక్కువైందని వైసీపీ కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాయడం మొగుడ్ని కొట్టిన ఇల్లాలు పంచాయితీకి వెళ్ళినట్లే ఉందిగా?




