2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు జరిగిన ఎన్నికలను ‘విభజన’ ‘సెంటిమెంట్స్’ చాలా ప్రభావితం చేశాయి. అందుకే ఏపీ, తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించి చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు అధికారం కట్టబెట్టారు.
ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమస్యల పట్ల వారిద్దరికీ పూర్తి అవగాహన ఉన్నందున అందుకు అనుగుణంగానే పనిచేశారు. కానీ ఆ తర్వాత ఎన్నికలలో ఏపీలో చంద్రబాబు నాయుడు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ఇద్దరూ ఓడిపోయారు.
అప్పుడు 2019లో టిడిపికి వ్యతిరేకంగా ఏర్పడిన ‘రాజకీయ వాతావరణమే’ ఇప్పుడు 2023 ఎన్నికలలో కేసీఆర్కి కూడా ఏర్పడినందునే ఓడిపోయారని చెప్పవచ్చు. ఇప్పుడు 2024లో జగన్ వంతు వచ్చింది.
ఏపీలో మళ్ళీ సరిగ్గా అటువంటి రాజకీయ వాతావరణమే నెలకొని ఉందిప్పుడు. టిడిపి, జనసేనల పొత్తులతో అది మొదలైంది. వైఎస్ షర్మిల రాకతో వైసీపి పరిస్థితి క్లిష్టంగా మారింది.
ఒకవేళ టిడిపి, జనసేనలతో బీజేపీతో కూడా కలిస్తే అదే ఏపీలో వైసీపి అధ్యాయానికి ముగింపుగా భావించవచ్చు. 2014 ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీలు కలిసినప్పుడు అదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగబోతోంది.
అయితే 2014 ఎన్నికలలో మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పటికీ జనసేన పోటీ చేయకుండా వాటికి మద్దతు ఇచ్చింది. ఈ పదేళ్ళలో పవన్ కళ్యాణ్ చాలా డక్కాముక్కీలు తిని రాజకీయాలలో రాటు తేలారు. బీజేపీతో కంటే టిడిపి కలిసి పనిచేయడమే మంచిదని గట్టిగా నమ్మి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
ఈసారి ఎన్నికలకు చాలా ముందే టిడిపితో పొత్తులు, సీట్లు, ఉమ్మడి కార్యాచరణ, మ్యానిఫెస్టో అన్నిటినీ ఖరారు చేసుకున్నారు. సీట్ల సర్దుబాట్ల విషయంలో కూడా చాలా రాజకీయ పరిణతి, పట్టువిడుపులు ప్రదర్శిస్తూ 24 స్థానాలలో జనసేన గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సిద్దపడ్డారు.
రెండు పార్టీలు కలిసి ప్రత్తిపాడు సమీపంలో తాడేపల్లిగూడెం హైవే వద్ద బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ‘తెలుగు జన విజయ కేతనం’ జెండా పేరుతో భారీ బహిరంగ సభని నిర్వహించబోతున్నాయి. బీజేపీ ఇంకా గోడ మీద పిల్లిలా కూర్చొని చూస్తుంటే, టిడిపి, జనసేనలు ఇంత కలిసికట్టుగా, ఇంత చురుకుగా బహిరంగ సభ నిర్వహిస్తుండటం గమనార్హం.
ఈ తొలి సభతోనే టిడిపి, జనసేనల పొత్తులు, భవిష్య కార్యాచరణ, ఉమ్మడి మ్యానిఫెస్టో పట్ల రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా జనసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న వర్గాలకు పూర్తి స్పష్టత వస్తుంది. అంతేకాదు… టిడిపి, జనసేనలు అటు బీజేపీకి, ఇటు వైసీపికి కూడా తమ పొత్తుల గురించి బలమైన సంకేతం పంపిస్తున్నట్లే భావించవచ్చు.
ముఖ్యంగా… టిడిపి, జనసేనల పొత్తు ఏదో ఓ దశలో తప్పక విచ్ఛిన్నం అయిపోతాయని లేదా విచ్ఛిన్నం చేయవచ్చని కలలు కంటూ సీట్ల విషయంలో జనసేనను రెచ్చగొట్టి టిడిపి, జనసేనల పొత్తులను విచ్ఛిన్నం చేసేందుకు విఫలయత్నం చేస్తున్న వైసీపికి ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే.
జగన్ సిద్దం సభలలో చొక్కా మడత పెట్టమని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంటే, టిడిపి, జనసేనలు ‘తెలుగు జన విజయ కేతనం’ ఎగురవేస్తూ ప్రజలకు బలమైన, చాలా సానుకూలమైన సంకేతాలు పంపిస్తుండటం గమనిస్తే మూడు పార్టీల భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో తెలిసిపోతోంది కదా?




