ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు, పార్టీకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు సాధించుకోగలిగాడు అనే ఘోర ఓటమి అవమాన భారం నుంచి జనసేనాని 2024 ఎన్నికలలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.
పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపు జెండా ఎగరేసి 100 % స్ట్రైక్ రేట్ సాధించి, పిఠాపురంలో పవన్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజకీయాలలో ఇలా జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వరకు ఎదిగిన పవన్ రాజకీయ ప్రస్థానం, జనసేన రాజకీయ ప్రయాణం తెలంగాణలో ఎలా సాగుతుంది అనేది గమనిస్తే,
తెలంగాణ రాజకీయాలలో జనసేన ప్రస్తావన అనేది పాలమీద పొంగు మాదిరి ఉవ్వెత్తున ఎగిసి అంతే వేగంగా కిందకు జారిపోతుంది. పవన్ కున్న సినీ చరిష్మా ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. మోడీ హైద్రాబాద్ పర్యటన అనంతరం తెలంగాణ రాజకీయాలలో జనసేన పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది.
ఏపీ రాజకీయ విశ్లేషణలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసిన విమర్శలు, అందుకు పవన్ నుంచి వచ్చిన కౌంటర్ తెలంగాణ లో జనసేన పేరు పాల మీద పొంగు మాదిరి ఉవ్వెత్తున పైకి లేచింది.
ఇక ఆ తరువాత తెలంగాణ ఆవిర్భావ సభ సందర్భంగా టి. జనసేన ఏర్పాటు చేసిన నవనిర్మాణ సభ కు రేవంత్ సర్కార్ అనుమతి నిరాకరించడం, ఇక కాంగ్రెస్ లో ఒక వర్గం ఎమ్మెల్యే లు, మంత్రలు పవన్ టార్గెట్ గా రెచ్చిపోవడం, బిఆర్ఎస్ మేము సైతం అంటూ పవన్ పై విమర్శలు చేయడం,
తెరాస కవిత కూడా పదేపదే పవన్ టార్గెట్ గా ముందుకెళ్లడం, ఇక తెలంగాణ జర్నలిస్టుల పేరుతో మరికొందరు పవన్ పై హద్దులు దాటి విమర్శలు గుప్పించడం, బీజేపీ ఇచ్చిన ప్యాకేజీ తోనే పవన్ తెలంగాణ రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వైసీపీ నినాదాలను తెలంగాణలో ప్రచారం చెయ్యడం ఇలా తెలంగాణ రాజకీయాలలో అసలు ఊసే లేని జనసేన కొంతకాలం పాటు తెలంగాణ రాజకీయ వార్తలలో నిత్యం నానింది.
ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తగ్గేదెలా అంటూ తన పై వస్తున్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ వచ్చారు. తెలంగాణ మీ అయ్యా జాగీరా.? అంటూ తీవ్ర స్థాయిలో కౌంటర్ అటాక్ చెయ్యడం తో ఇక టి. జనసేన నేతలు సైతం పవన్ తో కలిసి తమ స్వరం వినిపించడం తో తెలంగాణ రాజకీయాలలోకి పవన్ ఎంట్రీ, జనసేన ఆగమనం అంటూ పవన్ అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
అందుకు బలం చేకూరేలా హైద్రాబాద్ లో జనసేన పార్టీ కేంద్ర కార్యలయాన్ని ఏర్పాటు చేసారు పవన్. ఈ పరిణామాలు చకచకా జరిగిపోవడంతో తెలంగాణ రాజకీయాలలోకి జనసేన జీరో తో మొదలు పెట్టి హీరో కానుందా అంటూ పవన్ అభిమానులు టి.జనసేన బలోపేతం కోసం ఎదురుచూసారు.
ఇక పవన్ చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ పవన్ పై కబ్జా మరకలు సైతం గుప్పించారు కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు. అటువంటి విమర్శలకు సైతం పవన్ బెదరలేదు, వెనక్కి తగ్గలేదు, ప్రభుత్వం విచారణ జరిపి అది కబ్జా అని తేలితే తన భూమిని నిరభ్యంతరంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఇలా కొంతకాలం తెలంగాణ రాజకీయాలలో జనసేన ప్రస్తావన పాల మీద పొంగు మాదిరి పైపైకి ఎగిసింది. ఇక అటు తరువాత నుంచి అదే పొంగు మాదిరి అంతే వేగంగా కిందకు జారిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జనసేన ఊసే కనిపించడం లేదు. నాడు బీజేపీ ఇచ్చిన ప్యాకేజీ కే పవన్ ఇక్కడ రాజకీయం మొదలు పెట్టారు అంటూ గళం విప్పిన తెలంగాణ సోకాల్డ్ రెడ్డి నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.




