క్రియాశీల రాజకీయాలపై చాలా అరుదుగా స్పందించే పవన్ కళ్యాణ్… ఎప్పుడు స్పందించినా గానీ కేంద్ర స్థాయిలో ఉన్న ఎంపీలు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులపై విమర్శలు చేస్తుంటారు. రాష్ట్ర సమస్యలపై మరియు రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం లేదని, ఈ దిశగా కార్యాచరణ చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచి, రాష్ట్ర అవసరాలను సాధించాలని సూచనలు చేస్తూ ఉంటారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై గతంలో ఒకరిద్దరు ఎంపీ బహిరంగంగానే విమర్శించారు. గల్లా జయదేవ్ వంటి వారైతే స్వయంగా పవన్ ను కలిసి తాము చేస్తున్న విషయాలను చెప్తామని, అభివృద్ధి కోసం తాము ఎంతలా పాటు పడుతున్నామో వివరిస్తామని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించే ఎంపీలలో అనంతపురం ఎంపీ జేసీ స్టైలే వేరు కదా! తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చేసిన వ్యాఖ్యలపై తనదైన రీతిలో జేసీ దివాకర్ రెడ్డి కౌంటర్లు వేసారు.
“కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ ఆ సినిమా ఆయన, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు… అయితే ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో చెప్పవయ్యా… నువ్వు చెప్పినట్టే చేస్తాం… ఊరికనే మాటలు చెప్పడం కాదు… ఏం చేస్తారు ఒత్తిడి అంటే ఎంపీలు…” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “అవకాశం దొరికితే నాలుగు మాటలు మాట్లాడతారు… దేశానికి ఉన్న లింగాలలో ఏపీ కూడా ఒక బోడి లింగం… మోడీ ఏమైనా కాస్త అటు, ఇటుగా ఉంటే ఒత్తిడి చేయడానికి నువ్వు చెప్పినట్టు ఒత్తిడి చేస్తే… ఏమైనా ఫలితం ఉండేది… అయినా ఎంపీలు అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు…” అంటూ పవన్ ను ఉద్దేశించి పై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు జేసీ.
రాజకీయాల్లో జేసీ మార్క్ డైలాగ్స్ మరొకరికి సాధ్యం కాదు. ప్రాక్టికల్ గా మాట్లాడడంలో జేసీ తర్వాతే మరొకరు అన్న దానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు ఎప్పుడూ చెప్తుంటాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. జేసీ అన్నట్టు నిజంగానే… ఒత్తిడి అంటే ఏ విధంగా ఒత్తిడి చేయాలో..? పవనే చెప్పేస్తే పోలా..!





