తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై ఒంటికాలిపై లేచిన ఆమె… ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు వస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“బెదిరిస్తే పోయెటోళ్లం కాదు. ప్లకార్డులు పట్టుకుని వస్తే… మేం గంగ సోయి లేనోళ్లం కాదు. మేమెంత వర్కు జేస్తున్నమో గీ ప్రజలకు తెలవదా? ఇంకొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు. మా పోలీసులైతే ఏం సేత్తలేరు. ఎందుకంటే ‘ఫ్రెండ్లీ గవర్నమెంటు’ అన్నాం కాబట్టి మా సీఐ గారు, మా డీఎస్పీ గారు, మా ఎస్సైలు అంతా నిలబడి సూత్తాండ్రు. “బొక్కలిరిసి కుప్పపెడతా నేనే… ఇక ఊర్కునే సమస్యే లేదు” అంటూ శోభ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా పొలిటికల్ వర్గాల్లో కలకలం సృష్టించాయి.
చొప్పదండిలో చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులు చేతబట్టి కార్యక్రమానికి హాజరై, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆగ్రహావేశాలకు సదరు నియోజకవర్గపు ఎమ్మెల్యే శోభ వారిపై నోరు పారేసుకున్నారు. అధికారంలో ఉన్న నేతలకు అడ్డు, అదుపు ఉండదని మహిళా ఎమ్మెల్యేలు కూడా నిరూపిస్తున్నారు.





