2014లో రాష్ట్ర విభజన జరిగి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ‘పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే’ విధంగా రాజకీయ రూపం సంతరించుకుంది. విభజన బిల్లులో అనేక సమస్యలు ఉండడంతో రెండు రాష్ట్రాలు కేంద్రం వద్ద పంచాయితీ పెట్టాయి. దానికి తోడు ‘ఓటుకు నోటు – ఫోన్ ట్యాపింగ్’ కేసులతో రెండు తెలుగు రాష్ట్రాలు నేషనల్ వైడ్ గా ప్రచారం పొందాయి.
ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఒకడుకు వెనక్కి తగ్గి, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి స్వయంగా కేసీఆర్ ఇంటి దగ్గరకు వెళ్లి ఆహ్వానించారు. దానికి తగిన విధంగానే కేసీఆర్ కూడా ఆ వేడుకకు హాజరై, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి చంద్రబాబుతో కలిసి మరో అడుగు ముందుకేసారు. అయితే ఇపుడు సీన్ రివర్స్ అవ్వాల్సిన తరుణం వచ్చింది.
ఈ నెల 23వ తేదీ నుండి 27 వరకు కేసీఆర్ నిర్వహించనున్న ఆయుత చండీ యాగానికి ఏపీ సిఎం చంద్రబాబును ఆహ్వానించడానికి విజయవాడకు తరలి రానున్నారు కేసీఆర్. అయితే కేవలం ఆహ్వానం అందజేసి తిరుగు పయనం అవుతారా? లేక విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి తన మొక్కులు తీర్చుకుంటారా? అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి మరో మారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ విచ్చేయడం ఇరు రాష్ట్రాలకు శుభసూచకమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.





