దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేస్తా అంటూ దేశపర్యటనకు బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీని కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమయిందని వాటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తూ నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ ను కలిశారు ఆయన. అయితే నవీన్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల గురించి తాము చర్చించలేదన్నారు.
[m9ad]
ఇదే క్రమంలో ఆయన ఒక కీలకమైన విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఉభయ రాష్ట్రాలు ఏకమై పోరాడే అంశంపైనా మాట్లాడుకున్నాం అని చెప్పారు ఆయన. గత కొద్ది కాలంగా పోలవరం ప్రోజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఒడిశా ప్రభుత్వం. తరచుగా కోర్టు కేసులతో, కేంద్రానికి లేఖలు రాయడంతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం వల్ల తమ ఒడిశాలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని.. గిరిజన ప్రాంతాలు నీట మునుగుతున్నాయని.. అలాంటి చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని అక్కడి ప్రభుత్వం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.
కోర్టు కేసుల వల్ల పోలవరం నిర్మాణం కొనసాగించడానికి అవసరమైన అనుమతులు ఏ ఏడాదికి ఆ ఏడాది తీసుకోవాల్సి వస్తోంది. టీడీపీ ఎన్డీయే లో ఉన్నంత కాలం ఈ విషయంలో ఇబ్బంది రాలేదు. అయితే టీడీపీ బయటకు రాగానే అనుమతులు ఆలస్యం అయ్యాయి. దానిపై వివాదం చెలరేగాకగానీ కేంద్రం దిగి రాలేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర తన సొంత నిధులతో ప్రాజెక్టును ముందుకు నడిపిస్తుంది. అదే విధంగా పోలవరం కోసం తెలంగాణలోని ఏడూ మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై కేసీఆర్ కు అభ్యంతరం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుపై ఉభయ రాష్ట్రాలు ఏకమై పోరాడే అంశంపైనా మాట్లాడుకున్నాం అని సాక్షాత్తు మీడియా ముఖంగా నవీన్ పట్నాయక్ చెప్పడమంటే కేసీఆర్, నవీన్ కలిసి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయడమనే అనుకోవాలా? ఒక జాతీయ ప్రాజెక్టును అడ్డుకోవడమేనా కేసీఆర్ జాతీయ స్థాయిలో చేయ్యబోయే గుణాత్మక రాజకీయం? అని ఆంధ్రప్రదేశ్ లోని నాయకులు విమర్శిస్తున్నారు. తెరాసకు మద్దతు ఇస్తున్న వైకాపా, జనసేనలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని వారు ప్రశ్నిస్తున్నారు.





