ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ కథ మరియు స్క్రీన్ప్లే అందించి దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మించిన ‘శంకరాభరణం’ చిత్రం గత వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా ప్రచారం చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ప్రచారం చేసినంతగా ఈ సినిమా లేదంటూ ప్రేక్షకులు తేల్చి చెప్పారు. ముందు నుండి కోన చెబుతున్నట్లుగా ఈ సినిమా కొత్తగా ఏమీ లేదు అని, చెత్తగానే ఉంది అంటూ సినీ విమర్శకులు సైతం తేల్చేశారు.
‘శంకరాభరణం’ సూపర్ హిట్ అని భావించిన రచయిత కోన వెంకట్ వచ్చిన ఫలితంతో షాక్ తిన్నాడు. ఈయన ప్రస్తుతం సినిమాకు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాడు. సినిమాకు ఎలాగైనా ప్రేక్షకులను రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. పబ్లిసిటీతో పాటు సినిమాలో మార్పులు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని కోన భావించాడు. అందుకే కోన చివరి ప్రయత్నంగా ‘శంకరాభరణం’ నుండి దాదాపు 15 నిమిషాల నిడివి కలిగిన సీన్స్ను తొలగించినట్లుగా తెలుస్తోంది. నిడివి ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకుల్లో కాస్త అసహనం వ్యక్తం అయ్యిందని, రీ ఎడిట్ వల్ల ఆ అసహనం కలగదని కోన భావిస్తున్నాడు. సినిమా గురించి ఒక్కసారి పబ్లిక్లోకి టాక్ వెళ్లిన తర్వాత మరే ప్రయత్నాలు చేసినా కూడా వృదా ప్రయత్నాలే అవుతాయి అనేది గతంలో పలు సినిమాల ఫలితాన్ని చూస్తే అర్థం అవుతుంది. అయినా కూడా ఏదో మానవ ప్రయత్నం చేయాలని నిర్మాత కోన ఈ పని చేశాడు.





