ఆంధ్రా వలసపాలకుల నుంచి విముక్తి కోసం అంటూ నాడు కేసీఆర్ నేతృత్వంలో అందరూ కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణకు విముక్తి లభించింది కనుక ప్రజల జీవితాలలో ఏమైనా గణనీయమైన మార్పు వచ్చిందా? అంటే లేదని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మైకు పట్టుకొని చెపుతున్నారు.
తన తండ్రి హయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు. వారిలో ఆమె కూడా ఒకరని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటారు.
కేసీఆర్ కుటుంబానికి అన్ని వేల ఎకరాలు వారసత్వంగా రాలేదు కదా? పదేళ్ళ పాలనలోనే సంపాదించినవే కదా?అని సిఎం రేవంత్ రెడ్డి తరచూ ప్రశ్నిస్తూనే ఉంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన దోపిడీపై ఒక కమీషన్, విద్యుత్ ప్లాంట్స్ నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలపై మరో కమీషన్, ధరణి పోర్టల్ పేరుతో జరిగిన అక్రమ భూబదిలీలు, లావాదేవీలపై సిట్ ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ బీఆర్ఎస్ దోపిడీకి గురైందని అర్దమవుతోంది.
కేటీఆర్ కూడా నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, కమీషన్ల గురించి విమర్శిస్తూనే ఉంటారు. నేడు ప్రెస్మీట్ పెట్టి సిఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన ‘టెసారాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ అనే దొంగ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ అల్లుడు పార్ట్నర్గా ఉన్న కంపెనీ కోసం కొడంగల్లోని లగచర్లలో గిరిజనుల భూములను లాక్కున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అంటే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అది అందినకాడికి దోచుకుంటుందని ఈ పరస్పర ఆరోపణలతో స్పష్టమవుతోంది కదా?
కనుక తెలంగాణ ఏర్పడింది ప్రజల కోసమా? లేక రాజకీయ నాయకులు దోచుకోవడం కోసమా? అనే సందేహం కలుగుతుంది.
నాడు సుమారు 1,400 మందికి ఉద్యమకారులు బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే, చివరికి ఇలా దోపిడీకి గురవుతుండటం చాలా బాధాకరం.




