ప్రతి ఏడాది ప్రకటించే ‘ఫోర్బ్స్’ టాప్ 100 సెలబ్రిటీ జాబితా 2015 సంవత్సరానికి గానూ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉండే సెలబ్రిటీలలో అత్యధిక ఆదాయం, ఫేమ్ లను పరిగణనలోకి తీసుకుని లెక్కించి ఇచ్చే ఈ ర్యాంకింగ్స్ లో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి టాప్ లో నిలిచారు. దక్షిణాదిలో పోలిస్తే 2వ స్థానంలో ఉన్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ ఓవరాల్ గా 14వ స్థానంలో, దక్షిణాదికి చెందిన జాబితాలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
దేశవ్యాప్త ర్యాకింగ్స్ లో 36వ ర్యాంక్ దక్కించుకున్న మహేష్, 2014వ ఏడాదితో పోల్చుకుంటే ఓ ఆరు ర్యాంకులు క్రిందికి వచ్చారు. ఇక, టాలీవుడ్ లో ప్రిన్స్ కు పోటీగా పరిగణించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2015 జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. 2014వ సంవత్సరంలో 74వ స్థానంలో నిలిచిన పవన్, 2015కు గానూ టాప్ 100లో నిలవలేకపోయారు. ఇక, దక్షిణాది సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే… ధనుష్ (37), సానియా మీర్జా (38), అల్లు అర్జున్ (42), కమల్ హాసన్ (46), రజనీకాంత్ (69), సూర్య (71), రాజమౌళి (72), రవితేజ (74), ప్రభాస్ (77), పూరీ జగన్నాధ్ (89) ర్యాంకింగ్స్ లో ఉన్నారు.
ఒక్క బాలీవుడ్ సినిమా కూడా చేయకుండా నేషనల్ వైడ్ గా కొనసాగుతున్న ప్రిన్స్ హవాను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెలుగు వాడి సత్తాకు మరోసారి నిదర్శనంగా నిలిచారని సోషల్ మీడియాలో ప్రిన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. “శ్రీమంతుడు” విజయంతో మాంచి ఊపు మీదున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఈ వార్త మరింత సంతోషాన్నిస్తోంది.





