కల్తీ మద్యం కేసులో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒకప్పుడు ప్రజా ప్రతినిధిగా ఉన్న మల్లాది విష్ణుపై స్థానిక ప్రజలు మండిపడుతుండగా, విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం మల్లాది విష్ణు పేరు పెను చర్చలకు దారితీసింది. ఒకప్పుడు మల్లాది విష్ణు పరిస్థితి ఏమిటి? ఉడా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన తర్వాత మల్లాది విష్ణు ఎలా ఎదిగారు? అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మల్లాది కూడబెట్టిన మొత్తం ఎంత? అన్న రీతిలో బెజవాడ పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది బార్ అండ్ రెస్టారెంట్ లు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు చేసే వ్యాపారాలకు వారి కుటుంబ సభ్యుల పేర్లు వాడుకోవడం షరా మామూలే! ఇది మల్లాది విష్ణు మొదలు పెట్టింది కాదు, అలాగే మల్లాది విష్ణుతో అంతమయ్యేది కాదు. వ్యాపార విశేషాలు పక్కన పెడితే, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డికి మల్లాది విష్ణు నమ్మిన బంటు అని స్థానికంగా లభించే సమాచారం. ఈ నమ్మకంతోనే మల్లాది విష్ణు ఉడా చైర్మెన్ అవ్వడం వెనుక, అలాగే విజయవాడ ఎమ్మెల్యే కావడం వెనుక వైఎస్సార్ హస్తం ఉందన్నది పొలిటికల్ వర్గాల్లో బహిరంగంగా వెల్లడయ్యే విషయమే.
అలాగే, వైయస్ ముఖ్యమంత్రి హయాంలో మల్లాది విష్ణు రేంజ్ అమాంతం పెరిగిపోయిందని, వాస్తవానికి వైయస్ కున్న బినామీల జాబితాలో మల్లాది విష్ణు పేరు కూడా ఉందని పొలిటికల్ వర్గాల టాక్. ఈ అనుబంధంతోనే వైయస్ మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్ కు విష్ణు అండగా నిలబడతారని అంచనా వేసారు. విజయవాడలో జగన్ నిర్వహించిన ఒకటి, రెండు కార్యక్రమాల్లో విష్ణు తారసపడ్డారు కూడా! కానీ ఏం జరిగిందో ఏమో గానీ, ఉన్నట్లుండి ఒక్కసారిగా జగన్ కు దూరమయ్యారు.
దీనిపై బెజవాడ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద కధనాలే వెలువడ్డాయి. వైయస్ బినామీగా ఉన్న విష్ణు వద్ద కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, అవన్నీ జగన్ తిరిగి కోరడంతో, విష్ణు వెనుకడుగు వేసారని, ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య హాట్ హాట్ డిస్కషన్ నడిచిందని విజయవాడ రాజకీయ నాయకులలో హల్చల్ చేస్తున్న సమాచారం. ఈ కధనాల్లో ఎంత వాస్తవం ఉందనేది పక్కన పెడితే, వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లాది విష్ణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనేది బహిరంగ రహస్యం.





