‘ఈడోరకం ఆడోరకం’ సినిమా ఇచ్చిన రిటర్న్స్ తో మంచి ఊపు మీదున్న మంచు వారి వారసుడు విష్ణు తన భవిష్యత్తు సినిమాల గురించి ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ మాటల రచయిత, సుప్రసిద్ధ నటుడు తనికెళ్ల భరణి స్క్రిప్ట్ ఆధారంగా రూపొందుతున్న ‘కన్నప్ప’ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, అలాగే నా డ్రీం ప్రాజెక్ట్ ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ‘రామాయణం’ను ఎన్ని భాగాలుగా చూపించాలనే దానిపై కూడా ఆలోచనలు చేస్తున్నామని ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం నాన్న గారిదే తప్ప, ఏ విషయంలోనైనా తన తండ్రిని ప్రశ్నించే అర్హత గానీ, స్థాయి గానీ తనకు లేవని విష్ణు స్పష్టం చేసారు. అయినా, తన తండ్రికి రాజకీయాలేమీ కొత్త కాదని, గతంలోనే టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా చేశారని, ముక్కుసూటి తనానికి రాజకీయాలు సరిపడవని తాను భావిస్తున్నట్లుగా విష్ణు చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాలలో సంచలనాత్మకమయ్యాయి.
‘పీస్ ఆఫ్ మైండ్’ తో ఉన్న తన తండ్రికి లేనిపోని చిక్కులు వచ్చి పడతాయేమోనని తనకు అనిపిస్తున్నట్లుగా చెప్పిన విష్ణు, ఇదే విషయాన్ని తన తండ్రితో నేరుగా చెప్పలేనని అన్నారు. తమకు జన్మనిచ్చారని, ఒకవేళ ఆయన ఏదైనా తప్పటడుగు వేస్తున్నా, ఆ విషయాన్ని తన తల్లికి చెప్పగలుగుతాము కానీ, తండ్రికి మాత్రం చెప్పలేమని విష్ణు తన మనసులో మాట బయటపెట్టారు. ఇక, నటుడిగా తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిత్రం ‘రౌడీ’ అని, పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ‘అనుక్షణం’ అని తెలిపాడు మంచు విష్ణు.





