‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత వెంకటేష్ ఇప్పటి వరకు మరో సినిమాలో నటించింది లేదు. ఆ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం కాబోతున్న ఈ సమయంలో తన తర్వాత సినిమాలో నటించేందుకు వెంకటేష్ సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే వెంకటేష్ తర్వాత సినిమా మారుతి దర్శకత్వంలో అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మారుతి ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో గతంలోనే సినిమా రావాల్సి ఉంది. కాని కొన్ని కథ వివాదాస్పదం అవ్వడం వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ఈనెలలోనే ప్రారంభం కాబోతున్న వెంకీ, మారుతిల సినిమాకు టైటిల్గా ఎన్నో పేర్లు ప్రచారం అయ్యాయి. మొదట ‘రాధా కృష్ణ’, ఆ తర్వాత కూడా పలు పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. అయితే కథానుసారంగా ఈ సినిమాకు ‘బాబు బంగారం’ అయితే బాగా సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు మారుతి దీన్నే ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో వెంకీకి జోడీగా నయనతార హీరోయిన్గా నటించనుండగా, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. వచ్చే వేసవి చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.





