“క్రమశిక్షణకు మారు పేరు మా అభిమానులు” అంటూ మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి సాయి ధరమ్ తేజ్ వరకు ‘మెగా’ హీరోలంతా వారి అభిమానులను ఆకాశానికేత్తెస్తుంటారు. వారి సినిమాలను ఆదరించాలి కాబట్టి… మెగా హీరోలంతా ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా ఫ్యాన్స్ ను మునగ చెట్టు ఎక్కించేస్తుంటారు… అతిశయోక్తులతో అభివర్ణిస్తుంటారు. చిరంజీవి అంతటి హీరో ‘మీరే నా ప్రాణాలు’ అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి అంటే అభిమాని ఎవరైనా… భావోద్వేగానికి గురి కాకుండా ఉంటారా..? అలా మాటలతో పడేసే హీరోల పట్ల అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకు పర్వాలేదు… కానీ అది హద్దులు దాటితే వారిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఆయా హీరోల పైనే ఉంటుంది. మరి ఈ విషయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మొదలుకొని మెగా హీరోలంతా మూకుమ్మడిగా విఫలమవుతున్నారనేది సినీ పరిశీలకుల మాట.
గడిచిన కొన్ని సంవత్సరాలలోని ‘మెగా’ ఈవెంట్ లు మొదలు, మెగా హీరోలు పాల్గొనే ఇతర వేడుకలను పరిశీలిస్తే… అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే వెకిలి చేష్టలు గుర్తుకు వస్తాయి. వీరి ఆగడాలు ఎక్కడి వరకు వెళ్లాయంటే… ప్రస్తుతం ఏ మెగా హీరోకు సంబంధించి ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా… ఏ మెగా హీరోను తమ వేడుకకు ఆహ్వానించాలన్నా… ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. మెగా హీరోల సినిమాల ఆడియో వేదికలన్నీ అతిధులకు “అవమాన వేడుకలు”గా మారిపోతున్నాయి.
తాజాగా జరిగిన “లోఫర్” ఆడియో వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో… అత్యంత ‘క్రమశిక్షణ’ పరులైన మెగా అభిమానులు ‘పవన్… పవన్…’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వీరి ప్రవర్తనతో విసుగు చెందిన ప్రభాస్… ‘నాక్కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే… ఇప్పుడు మాట్లాడవచ్చా…’ అంటూ అభ్యర్ధించారు. అయినప్పటికీ అదే రకమైన అరుపులు, కేకలతో విచ్చేసిన అతిధులను ఓ రకంగా అవమానించారు. ఇదేదో కొత్తగా నిన్న, ఈ రోజు జరిగింది కాదు… గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఒక్క ప్రభాసే కాదు, ఈ అత్యంత ‘క్రమశిక్షణ’ గల అభిమానుల బారిన పడ్డ వారి జాబితా చాలానే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన అతిరధ మహారధులు, లెజెండ్ లు మైక్ పట్టుకున్న సందర్భంలో కూడా వీరి ప్రవర్తన దీనికి భిన్నంగా ఏమీ లేదు.
అయితే దీనికి పరిష్కార మార్గం ఒక్కటే… అభిమానులను మునగ చెట్టు ఎక్కించిన ఆయా హీరోలే… అభిమానులకు అర్ధమయ్యే రీతిలో సర్ధిచెప్పాలి. లేని పక్షంలో ఆయా హీరోలే ఇదంతా వెనకుండి నడిపిస్తున్నారని నమ్మాల్సి వస్తుంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ఫైర్ అయినప్పటికీ, అది “బ్రూస్ లీ” వేడుక వరకే పరిమితమైంది, ‘లోఫర్’కు వచ్చేపాటికి మునుపటి పరిస్థితి పునరావృతమైంది. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది… అది కట్టలు తెంచుకుంటే ఆ పరిణామాలను ఆయా హీరోలే చవిచూడాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ అభిమానులను ఉద్దేశించి పెదవి విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. “అతిధులను పిలిచేది గౌరవించడానికే గానీ, అవమానించడానికి కాదు…” అన్న సూక్తులను మెగా అభిమానుల చెవిన పడేయాలి. లేదంటే మున్ముందు అభిమానులు లేకుండా ‘మెగా’ ఈవెంట్లు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి… అలాగే మెగా హీరోలు అతిధులుగా వెళ్ళే అవకాశాలను కోల్పోయిన వారవుతారు.





