ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ‘రోజా – అనిత’ ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. రోజా అసభ్య పదజాలం, ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అనిత ఏడుపు సీన్లు… రసవత్తరంగా సాగిన ఎపిసోడ్ లో రోజా ఒక ఏడాది పాటు సస్పెన్షన్… ఇలా అన్ని వడివడిగా జరిగిపోయాయి. దీనిపై తాజాగా ఓ మీడియా ప్రముఖుడు చేసిన ఇంటర్వ్యూ లో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తన అంతరంగాన్ని బయటపెట్టింది.
“రోజా చేసిన వ్యక్తిగత దూషణల స్థాయిలో దిగజారి నేను మాట్లాడలేను, నా నేపథ్యం గురించి ఆమెకు ఏమీ తెలియదు, అలాంటప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? నా కుటుంబంలో జరిగిన విషయాలు ఆమెకు తెలియవు కదా! దళిత సామజిక వర్గానికి చెందిన దానినని తనపై మరింత చులకన భావన చూపడం సహించలేకపోయాను. అదే ఇంకో అగ్రవర్ణాల మహిళలను, గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లను అనగలిగే ధైర్యముందా? ఒకవేళ అంటే అసెంబ్లీ దాటి బయటకు వెళ్లగలుగుతుందా?” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
“వ్యక్తిగతంగా నాకు, రోజాకు ఎలాంటి వైరం లేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తగ్గాలి? అయినా రోజా అంత నీచంగా మరొకరు మాట్లాడరు, రేపు వారిద్దరు పిల్లలు ‘ఏంటమ్మా నువ్వు ఇలా అన్నావా?’ అంటే ఏమని సమాధానం చెబుతుంది. రోజా మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే విషయమై లాయర్లను సంప్రదిస్తున్నాను. పరువునష్టం దావా కూడా వేస్తున్నాను. నా మనస్సాక్షి చల్లారడం లేదు. నా లాంటి వారిని టచ్ చేస్తే ఎలాగుంటుంది అన్నది రోజాకు తెలియాలి” అంటూ రోజాపై మండిపడ్డారు అనిత.





