నరేంద్ర మోడీ… మాటలు ఎక్కువ… చేతలు తక్కువ… ప్రస్తుతం వెల్లువెత్తుతున్న విమర్శలు. ముఖ్యంగా ఏపీ విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరి ఈ రకమైన విమర్శలకు ఊతమిస్తోంది. గతం ఎలా ఉన్నా, ప్రస్తుతం చెన్నైను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధానిగా నరేంద్ర మోడీ పై ఉంది. కనీసం ఇప్పుడైనా మోడీ ప్రకటించిన మొత్తం సాయాన్ని తమిళనాడుకు అందిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చెన్నైకు చేరుకోక ముందే 1000 కోట్ల రూపాయల తక్షణ ఆర్ధిక సాయం ప్రకటించిన మోడీ, గురువారం నాడు చెన్నైలో పర్యటించిన సందర్భంగా మరో 1000 కోట్లను ప్రకటించారు. అయితే తమిళనాడు సిఎం జయలలిత 5000 కోట్ల సాయాన్ని అందించాలని కోరారు. జయలలిత అడిగిన మాట అటుంచితే, ప్రకటించిన 2000 కోట్లు అయినా తమిళనాడు ఖాతాలో పడతాయా? లేదా? అన్న ఆసక్తి రాజకీయ వర్గాల నుండి వ్యక్తమవుతోంది.
చెన్నై వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే… 40 శాతం మేర టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బ తినడంతో దాదాపు 15 వేల కోట్లు పారిశ్రామిక నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యమైన పరిస్థితులు ఏర్పడాలంటే దాదాపు ఒక నెల రోజుల సమయం పట్టే విధంగా చెన్నై స్థితిగతులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలోనైనా రాజకీయ ఆలోచనలకు దూరంగా ప్రధాని స్పందిస్తారేమో చూడాలి.





