మరో పార్టీకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఎవరూ వెళ్ళలేని విధంగా సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీలోకి వెళ్ళారన్న విషయం తాజాగా వెలుగు చూసింది. వైసీపీని వీడిన తర్వాత ఓ దినపత్రికతో తన అనుభవాలు పంచుకున్న మైసూరా… ‘అసలు తానూ జగన్ పార్టీలో ఎలా చేరారో’ స్పష్టంగా తెలియజేసారు. మైసూరా వివరించిన ఈ సంగతులు విన్న తర్వాత ‘అసలు జగన్ ఒక రాజకీయ నాయకుడేనా?’ అన్న ప్రశ్న తలెత్తడం సహజమే మరి! మైసూరా వ్యాఖ్యలను పరిశీలిస్తే…
తనను పార్టీలోకి చేర్చుకునే విషయానికి సంబంధించి జగన్ మధ్యవర్తులను రంగంలోకి దించి చర్చలు జరుపుతున్నారని, అయితే ఈ వయసులో పార్టీ మారి చెడ్డ పేరు తెచ్చుకోవడమెందుకన్న రీతిలో తాను ఆలోచనలు చేస్తున్నానని తెలిపారు. పార్టీ మారకున్నా జగన్ తో కలిసి టిఫిన్ చేస్తే పోయేదేముందంటూ తనను మధ్యవర్తులు ఒత్తిడి తెచ్చారని, ఆ క్రమంలోనే ఒకానొక సందర్భంలో జగన్ ఇంటికి ఫార్మాలిటీగా టిఫిన్ కని వెళ్లగా, అప్పటికప్పుడు తన అనుమతి లేకుండా, తన ప్రమేయం లేకుండానే తన మెడలో పార్టీ కండువా వేశారని మైసూరా చెప్పుకొచ్చారు.
ఊహించని ఈ ఘటనతో తాను అయోమయంలో ఉండగానే, సదరు వార్త టీవీల్లో స్క్రోలింగ్ కావడం, టీడీపీ తనను సస్పెండ్ చేయడం వడివడిగా జరిగిపోయాయని ఆవేదన వ్యక్తపరిచిన మైసూరా, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, మంచి ప్రాధాన్యం ఇస్తామని, రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పించే దిశగా చర్యలు చేపడతామని కూడా జగన్ మధ్యవర్తుల ద్వారా చెప్పించారన్నారు. అయితే ఆ తర్వాత తనకు పార్టీలో అసలు విలువే ఇవ్వలేదని, సీనియర్లకు విలువ ఇచ్చే అలవాటే జగన్ లో లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మైసూరా వివరణ తర్వాత ‘పార్టీలోకి నేతలను ఇలాక్కూడా చేర్చుకోవచ్చా..?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చేరే వ్యక్తి అభిప్రాయాలతో సంబంధం లేకుండా, గందరగోళానికి గురిచేసి, పార్టీలో చేర్చుకున్న వైనం సిగ్గుచేటు క్రియగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో విధంగా చెప్పాలంటే… మోసపూరితమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. చిన్న చిన్న అంశాలలోనే జగన్ ఈ స్థాయిలో వ్యవహరిస్తే… ఆర్ధిక నేరాల ఆరోపణలు కేసులలో ఇంకెన్ని జిమ్మిక్కులు చేసారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.





