మెగా డీఎస్సీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలకు టీడీపీ ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది.
ఈ వ్యవహారంలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో సహా పలువురు సీనియర్లు కూడా నేడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది ఉపాధ్యాయులు తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం చూపాల్సిన వైసీపీ, డీఎస్సీ పేరుతో నీచ రాజకీయాలు చేస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందని వారు ఆరోపించారు.
వైసీపీ హయంలో డీఎస్సీ నిర్వహించకుండా తాత్సారం చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే డీఎస్సీ నిర్వహించారని, అందుకు తామందరం ఎంతగానో సంతోషిస్తుంటే, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫోటోలతో వారి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, ప్రశ్నపత్రం లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణతో పాటు లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశం వైసీపీ ప్రధాని మోడీకి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసింది. అలాగే హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. కానీ కేంద్రం స్పందించలేదు. రాజకీయాల కోసం ప్రజాహిత పిటిషన్లు వేయవద్దని హైకోర్టు మందలించింది.
కానీ సీజేపీ ఆందోళనల నుంచి స్పూర్తి పొందిన వైసీపీ, డీఎస్సీ పేరుతో ఆందోళనలు చేస్తే అటువంటి ఫలితమే సాధించవచ్చని భావిస్తున్నట్లుంది. కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. కనుక ఆయన చేత రాజీనామా చేయించగలిగితే కూటమి ప్రభుత్వం బలహీనపడుతుందని వైసీపీ ఆశ పడుతున్నట్లుంది.
ఇదివరకు కూటమి నుంచి జనసేనని దాని అధినేత డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని వేరు చేయాలని ప్రయత్నించి భంగపడిన వైసీపీ ఇప్పుడు నారా లోకేష్పై బాణం గురిపెట్టింది. అది చీకటిలో రాళ్ళు వేస్తున్నప్పటికీ వాటిలో ఒకటయినా తగలకపోదా?అని ఆశ పడుతున్నట్లుంది.
కానీ నేడు స్వయంగా ఉపాధ్యాయులే బయటకు వచ్చి కర్నూలులో ర్యాలీ నిర్వహించడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడినట్లయింది.
కానీ ఇలాంటి విషయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు, మొట్టికాయలు తిన్నా వైసీపీకి తగ్గే ఆలోచన, అలవాటు రెండూ లేవు. కనుక తన దీక్షలు, ధర్నాలు యధాతధంగా కొనసాగించవచ్చు. కనుక నేటికీ బంతి కూటమి ప్రభుత్వం కోర్టులోనే ఉందని భావించవచ్చు.




