గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో బిజెపి తప్పక స్పందించాల్సిన పరిస్థితి, మోడీ నిజాయితీ నిరూపించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ విద్యార్హతలను తెలిపే బీఏ, ఎంఏ సర్టిఫికేట్లను ప్రదర్శించారు. డిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ వర్సిటీ నుంచి ఎంఏ కోర్సులను పూర్తి చేశారని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ఇక, మోడీ విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే అమిత్ షా ప్రదర్శించిన సర్టిఫికేట్లు ఫేక్ అని, అసలు ఆ సంవత్సరంలో డిగ్రీ సర్టిఫికెట్లు అలా విడుదల చేయలేదని ఆప్ పార్టీ మోడీ సర్టిఫికేట్లను, ఆ సంవత్సరపు సర్టిఫికేట్లను పక్కన పెడుతూ సమాధానం ఇచ్చింది. అంతేగాక, బిఏ, ఎంఏలలో ఉన్న సర్టిఫికేట్లలో పేర్లు తేడా ఉన్నాయని, ఒకవేళ ఆ పేర్లు తేడా ఉంటే ఖచ్చితంగా ఒక అఫిడవిట్ ఉండాలని, అది ఎక్కడ ఉంది..? ఈ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా ఇవి ఫేక్ సర్టిఫికేట్లనీ అర్ధమవుతోందని సాక్ష్యాలు బయట పెట్టారు ఆప్ పార్టీ.
జరుగుతున్న ఈ పరిణామాలతో నిజంగానే మోడీ సర్టిఫికేట్లు ఫేక్ వేనా? అన్న ప్రశ్నలు ప్రజల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిజెపి తమ వాదనను వినిపిస్తుంటే, ఆప్ కూడా అదే స్థాయిలో జవాబు ఇస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో ఎలాంటి సంచలన నిజాలు బయటకు వస్తాయో చూడాలి.






