‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ అందించిన ‘అ…ఆ…’ విజయంతో మంచి ఊపు మీదున్నాడు యువ హీరో నితిన్. తనకున్న మార్కెట్ కు రెట్టింపు సంఖ్యలో కలెక్షన్స్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుతో టాప్ డైరెక్టర్ల మీద నితిన్ చూపు పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అ…ఆ…’ ఇచ్చిన సక్సెస్ ను కొనసాగిస్తూ స్టార్ హీరోగా ఎదిగేందుకు తన తదుపరి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తన సొంత బ్యానర్లో నిర్మించాలని డిసైడ్ అయినట్లుగా టాక్.
రవితేజకు ‘కిక్,’ అల్లు అర్జున్ కు ‘రేసుగుర్రం’ వంటి మెమరబుల్ హిట్స్ అందించి, ప్రస్తుతం చెర్రీతో ‘ధృవ’ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, తన సొంత బ్యానర్ లో తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడట. అలాగే ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ బ్యానర్ లో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడట. అయితే ముందుగా సురేందర్ రెడ్డి సినిమానే పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం.
సురేందర్ రెడ్డి సినిమాతో ముందుకెళ్ళడంలో తప్పులేదు గానీ, ‘అ…ఆ…’ ఇచ్చిన విజయాన్ని ఊహించుకుంటూ భారీ వ్యయంతో నిర్మిస్తే మాత్రం చేతులు కాల్చుకోక తప్పదన్న విషయాన్ని చాలా సందర్భాలలో తెలుగు సినిమాలు నిరూపించాయి. ‘అ…ఆ…’ విజయం సాధించింది అంటే అందులో చాలా అంశాలు ఉంటాయి. దర్శకుడి పేరు దగ్గర నుండి సినిమా విడుదలైన సీజన్ వరకు అనేక విషయాలు ‘అ…ఆ…’ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత అధోగతిలో ఉండడానికి కారణం కూడా ఇదే. ఒక సినిమా విజయాన్ని పోల్చుకుని అమాంతం తదుపరి సినిమాల బడ్జెట్ లు పెంచేసుకోవడం, సదరు హీరో మార్కెట్ కు మించి పెట్టుబడులు పెట్టడం వలనే సినీ పరిశ్రమలో ‘సక్సెస్’ అనేది ‘చుట్టం చూపు’లా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నితిన్ కూడా అలాగే కొనసాగితే చేతులు కాల్చుకోవడం తప్పదన్న హెచ్చరికలు సినీ విజ్ఞుల నుండి వ్యక్తమవుతున్నాయి.



