“నాన్నకు ప్రేమతో” సినిమా ఇచ్చిన ఫలితం కంటే, ఈ సినిమా ద్వారా తనను తానూ సరికొత్తగా ఆవిష్కరించుకున్న జూనియర్ ఎన్టీఆర్, విమర్శకుల నుండి లభించిన ప్రశంసలతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారన్నది వాస్తవం. అలాగే ఈ సినిమాతో ‘ఎ’ క్లాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం మరియు ఓవర్సీస్ లో తనకంటూ మార్కెట్ ఏర్పరచుకోవడం వంటి శుభపరిణామాలు ఏర్పడ్డాయి.
ఇలా పాజిటివ్ సంకేతాలతో తన తదుపరి చిత్రం “జనతా గ్యారేజ్” కోసం యంగ్ టైగర్ సన్నద్ధమవుతున్నారు. పెద్దగా గ్యాప్ లేకుండా తారక్ సినిమా సెట్స్ పైకి వెళ్తుండడంతో సంతోషంగా ఉన్న అభిమాన వర్గాలకు మరో ఆనందదాయకమైన వార్త అందుతోంది. గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ‘నందమూరి’ బ్రదర్స్ కాంభినేషన్ కళ్యాణ్ రామ్ – తారక్ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది.
ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రముఖ రచయిత వక్కంతం వంశీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. తారక్ సినిమాతో ‘మెగా ఫోన్’ పట్టుకోనున్నానని ఇప్పటికే స్పష్టం చేసిన వక్కంతం, ఈ నందమూరి బ్రదర్స్ నటించే మల్టీస్టారర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారా? లేక కేవలం కధను మాత్రమే అందించనున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మరింత అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడి కాబోతోందని విశ్వసనీయ సమాచారం.





