క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సారధ్యంలో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “నాన్నకు ప్రేమతో” ఆడియో విడుదల తేదీ 27గా ఖరారవ్వడంతో ‘జూనియర్’ అభిమానుల హంగామా షురూ అయ్యింది. హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే విచ్చేసిన అభిమానులందరిలో ప్రత్యేక గుర్తింపు కోసం మదనపల్లె ఫ్యాన్స్ స్పెషల్ టీ-షర్టులతో హాజరు కానున్నారు.
ఈ టీ-షర్టుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. “జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మదనపల్లె” అనే ముద్రణకు తోడు ‘ఎనీథింగ్ ఫర్… ఎవ్రీథింగ్ ఫర్… ఎన్టీఆర్’ అని “నాన్నకు ప్రేమతో” సినిమాలో జూనియర్ వున్న ఫోటోను ముద్రించారు. గతంలో ఇలాంటి హంగామాలను జరపడంలో పవన్, మహేష్ అభిమానులు ముందుండేవారన్న సంగతి తెలిసిందే. తాజా ఉదంతంతో తామేం తక్కువ కాదని, తారక్ అభిమానులు నిరూపిస్తున్నారు.
తాజా పరిణామాలతో జూనియర్ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతున్న “నాన్నకు ప్రేమతో” సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారని తాజా పరిణామాలు స్పష్టమవుతోంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన గీతాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని సినీవర్గాలు చెప్తున్నాయి.







