నానాటికి అసెంబ్లీ సమావేశాల అర్ధం మారుతూపోతుంది. ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార – విపక్షాల మధ్య జరిగే చర్చలకు వేదికైన అసెంబ్లీలు నేడు అధికార, విపక్ష పార్టీల బలప్రదర్శన కేంద్రాలుగా మారుతున్నాయి. నేడు మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ గేటు ముందే తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ చేపట్టిన నిరశన కార్యక్రమాలు అసెంబ్లీ వరకు వ్యాపించడంతో అధికార కాంగ్రెస్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ‘హామీల అమలులో కాంగ్రెస్ విఫలం’ అంటూ ముద్రించిన నల్ల చొక్కాలతో బిఆర్ఎస్ నేతలు అసెంబ్లీ లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు.
దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు మొదలై చివరికి అది బిఆర్ఎస్ నేతల అరెస్టుల వరకు వెళ్ళింది. అయితే ఈ ఉద్రిక్తతలో బిఆర్ఎస్ మహిళా నేతల పట్ల పోలీసులు అనుసరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుసరించిన తీరు విమర్శలకు దారి తీసింది. సునీతా లక్ష్మారెడ్డి పోలీసులు అసెంబ్లీ గేటు ముందే తన చీర లాగారంటూ కన్నీరు పెట్టుకోగా, ఇక సబితా ఇంద్రారెడ్డి ని పోలీసులు జుట్టు పట్టులకుని లాగుతున్న వీడియో ను బిఆర్ఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక బిఆర్ఎస్ మహిళా నేతల గోడు ఇలా ఉంటే అటు నల్ల టీ షర్ట్స్ వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలకి అనుమతి లభించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వివేకానంద లతో పాటుగా పలువురు బిఆర్ఎస్ నాయకులు తమ టీ షర్ట్స్ తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధనగ్న నిరశన చేపట్టారు.
అలాగే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అసెంబ్లీ ప్రాంగంణం వద్ద తమ లీడర్లను అడ్డుకుంటున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి తోపులాట జరగడం, ఫలితంగా కేటీఆర్ తో సహా పలువురు బిఆర్ఎస్ నేతలకు గాయాలైనట్లు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు రాజకీయ నాయకులకు దేవాలయాలుగా ఉండే అసెంబ్లీ లు ఇప్పుడు అధికార – విపక్ష పార్టీ నాయకుల మధ్య జరిగే వీధి పోరాటాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. అలాగే ఒకపక్క రాజకీయాలలో మహిళల ప్రాధాన్యం పెంచాలి అంటూనే మరోపక్క అదే అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానిస్తున్నారు.
ప్రజాసమస్యల పై చర్చలు కాస్త రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా మారుతున్నాయి. అధికార పార్టీకి విపక్ష పార్టీల సహకారం ఉండడం లేదంటూ అధికార పార్టీ నేతలు, అలాగే విపక్ష పార్టీల నేతలకు అధికార పార్టీల నుంచి సరైన గౌరవం దొరకడం లేదంటూ విపక్ష పార్టీల నాయకులు ఇలా ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది.? దాన్ని ఎలా నివారించవచ్చు అనేదాని మీడ్ ఇరువర్గాలు ద్రుష్టి పెట్టలేకపోతున్నారు. మరి ఈ పరిస్థితులు మారేదెప్పుడు.? చట్ట సభలకు అసలైన గౌరవం దక్కేదెప్పుడు.?
అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల అమానుష ప్రవర్తన! 😡
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని దారుణంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు!
ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం? pic.twitter.com/QaaO9KkUtQ
— BRS Party (@BRSparty) September 7, 2026





