హైదరాబాద్ నుండి అమరావతికి ఇప్పటికే కొన్ని శాఖలు తరలివచ్చాయి. అలాగే ఆయా శాఖల ఉద్యోగులు కూడా ఇప్పటికే బస్సులు, రైళ్ళు, కార్ల మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే అందరిలా రొటీన్ గా వస్తే ‘కిక్’ ఏముంది అని భావించిన ఏసీటీవో పోస్ట్ లో ఉన్న పద్మ సైకిల్ మీద హైదరాబాద్ నుండి పయనమై విజయవాడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా తన అనుభూతులను పంచుకున్న పద్మ… ప్రధానంగా సైకిల్ మీద రావడానికి గల కారణాన్ని వివరించారు. “నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అండి… ఏదైనా డిఫరెంట్ గా చేస్తాం… అందులోనూ ఖమ్మంలో పెరిగిన తానూ చిన్నప్పటి నుండి రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కేదానినని, అందుకే అందరిలా కాకుండా సైకిల్ మీద వచ్చానని, అయితే ఇరు రాష్ట్ర ప్రజలు తనపై చూపించిన అభిమానం ముందు ఈ కష్టం మరిచిపోయానని, ముఖ్యంగా రెండు రాష్ట్రాల బోర్డర్ గరికిపాడు చెక్ పోస్ట్ లో ప్రజలు హారతులిచ్చి, కేక్ కట్ చేసి, దండలు వేసి ఆశీర్వదించిన తీరు… బహుశా తన తోటివారు అసూయ పడే విధంగా ఉందని” పద్మ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
“తానూ కేవలం ఏసీటీవో వంటి చిన్న పోస్ట్ లో ఉన్నానని, అయితే ప్రజలు తనపై చూపిన అభిమానం బహుశా చీఫ్ సెక్రటరీకి కూడా దక్కదని, తనకు తెలంగాణాలో హైదరాబాద్ అంటే ఎంత ఇష్టమో, ఏపీలో విజయవాడ అన్నా కూడా అంతే ఇష్టమని, ఉద్యోగుల్లో ఉత్సాహం నింపడానికి తన వంతులో భాగంగా చేసిన ఈ ప్రయత్నం తనకు పూర్తి సంతోషాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ అధికారులు అభినందించారని, ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు” సదరు ఉద్యోగిని పద్మ.



