ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ ని పాచిపోయిన లడ్డులతో పోల్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఘోర పరాజయంతో ముందు ముందు మనుగడ సాగించాలంటే బీజేపీ సపోర్టు అవసరమని భావించి ఆ పార్టీకి దగ్గరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఈ బంధం మూన్నాళ్ళ ముచ్చట అయ్యేలా ఉంది.
కష్టాయ పార్టీ పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్నట్టే కనిపిస్తోంది. రాజ్యసభలో కీలక బిల్లుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ తో స్నేహంగా ఉంటే మేలని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఏకంగా జగన్ పార్టీని ఎన్డీయేలోకి తీసుకుంటారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎలాగో బీజేపీ గెలిచే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఉండదు అనే అంచనాకు వచ్చిన బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మోడీ ,అమిత్ షా తో జగన్ భేటీ కూడా సానుకూల వాతావరణంలోనే జరిగింది. మూడు రాజధానులు, మండలి రద్దుకు కూడా కేంద్రం మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ కు అది రాజకీయంగా ఎంతో ఇబ్బంది అనే చెప్పుకోవాలి.
మరో వైపు మోడీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు ఒక ఫోటో కూడా ఇవ్వకపోవడం విశేషం. బీజేపీతో పొత్తు పెట్టుకుని కనీసం మూడు నెలలు కూడా కాకముందే పవన్ కళ్యాణ్ ని ఇరకాటంలో పడేశారు కమలనాధులు. ఒకవేళ బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లో కలిసినా పవన్ కళ్యాణ్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా అది రాజకీయంగా ఇబ్బందే. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు పవన్ కళ్యాణ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం అనే చెప్పుకోవాలి.



