వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి మావిగన్ మీదుగా మళ్ళీ విజయవాడకు వచ్చేశారు. అక్కడే ఆగుతారో, లేదా మళ్ళీ మరో రాజధాని అంటారో ఆయనకే తెలియాలి.
అయితే ఆయన అమరావతిని ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా సీఎం చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది.
కానీ ఆయన పట్ల ద్వేషం దేనికి? అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఉన్నంత కాలం తాను అధికారంలోకి రావడం కష్టమని, ఒకవేళ వచ్చినా అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమని ఆయన భావిస్తుండటమే కారణం కావచ్చు.
అందువల్ల చంద్రబాబు నాయుడు ఆలోచనతో మొదలై జోరుగా నిర్మాణం సాగుతున్న అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరిస్తే, ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. బహుశః అందుకే అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లున్నారు.
అయితే ఇదొక్కటే కారణం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. జగన్ మొదటి నుంచి కూడా అమరావతిని రాష్ట్ర రాజధానిగా కాకుండా కులం, ఓటు బ్యాంకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తదితర కోణాల్లోనే చూస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రకరకాల ‘రాజకీయ వ్యూహాల’తో దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ ప్రయత్నాల్లో భాగంగానే అమరావతిని ఎంచుకునే పెట్టుబడిదారులు, కంపెనీలు, సంస్థలకు తమ పెట్టుబడులు, ప్రణాళికలు సురక్షితంగా ఉండవన్న సందేశాన్ని పంపాలని కోరుకుంటున్నట్లున్నారు.
గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు ప్రయత్నించినట్లే, ఇప్పుడు మావిగన్తో కూడా ఆయా ప్రాంతాల్లో కొన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు, రైతులను చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించే ప్రయత్నం చేయగాలనని అనుకుంటున్నట్లున్నారు.
తాను అమరావతిని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున, తన పార్టీకి ఓ బలమైన వ్యూహాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. కనుక వారి చేతికి ఇప్పుడు మావిగన్ ఇచ్చారనుకోవచ్చు.
కానీ జగన్ శ్రేయోభిలాషులు కూడా చెప్పని కొన్ని చేదు నిజాలు తెలుసుకుంటే ఆయనకే మంచిది.
మాట తప్పను, మడమ తిప్పనని గొప్పగా చెప్పుకునే తమ అధినేత జగన్ రాజధాని విషయంలో ఇన్నిసార్లు తన వైఖరి మార్చుకోవడం వలన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తించాలి.
మావిగన్ తూటాతో చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయబోతే అది ఆయన చేతికి ఆయుధం అందించినట్లే అవుతుందని గ్రహిస్తే మంచిది.
అమరావతి మీద, దానిని నిర్మిస్తున్న ప్రభుత్వం మీద ఎంత బురద జల్లినప్పటికీ 2029 ఎన్నికల నాటికి అమరావతిలో ముఖ్యమైన భవనాలు, మౌలిక వసతుల నిర్మాణ పనులు పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించడం చాలా ముఖ్యం.
ఎందుకంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు, మిత్రపక్షాలు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు ఒకసారి జగన్కు అవకాశం ఇస్తే ఐదేళ్ళలో ఏమీ చేయలేకపోయారని, కానీ తాము ప్రజలు గర్వపడేలా భవ్యమైన అమరావతిని నిర్మించామని చెప్పుకోకుండా ఉండరు.
అదే సమయంలో మేము ‘మావిగన్’ గురించి చెప్పుకుంటామని జగన్ స్వయంగా చెప్పారు. అప్పుడు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేరే చెప్పక్కరలేదు.
కనుక అమరావతి గురించి పునరాలోచన చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి లేదు. కానీ మావిగన్ వ్యూహంపై జగన్, వైసీపీ నేతలు తప్పకుండా పునరాలోచన చేయడం వారికే మంచిది.






