పవర్ స్టార్ అభిమానుల నిరీక్షణకు ఓ స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 25వ తేదీన గానీ, ఏప్రిల్ 1వ తేదీన గానీ “భీమ్లా నాయక్” సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటంటే… “పరిస్థితులు ఎప్పుడు సర్దుమణిగితే అప్పుడు!”
మరి ఆ పరిస్థితులు ఏమిటయ్యా అంటే… కరోనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, అంతకుముందు విధించిన వీకెండ్ కర్ఫ్యూ నిబంధనలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తున్నాయి.
‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25వ తేదీ రిలీజ్ అన్నది కేవలం జగన్ సర్కార్ తో ముడిపడి ఉన్న అంశంగా మారింది. ఏపీలో టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి వస్తే ఖచ్చితంగా ఫిబ్రవరి 25వ తేదీన ‘భీమ్లా నాయక్’ ఆగమనం పక్కాగా మారుతుంది. లేని పక్షంలో ఏప్రిల్ 1 విడుదల ఖాయం.
ఎందుకంటే అప్పటికి “రాధే శ్యామ్” మరియు “ఆర్ఆర్ఆర్” సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి గనుక, ప్రత్యేకంగా “భీమ్లా నాయక్”ను టార్గెట్ చేయడానికి జగన్ సర్కార్ కు అవకాశం ఉండదు. తాజాగా దిల్ రాజు చేసిన ప్రకటన ప్రకారం అయితే ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అతి త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయని ఇటీవల దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మీడియా వర్గాలకు ఏ మాత్రం సమాచారం లేకపోవడంతో, బయటకు ఏమి తెలియకుండా బ్యాక్ గ్రౌండ్ లో అసలు కధంతా నడుస్తుందేమోనన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.
రెండు రిలీజ్ డేట్స్ ఇచ్చి “భీమ్లా నాయక్” యూనిట్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించింది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయలేకపోతే దానికి కారణం జగన్ సర్కార్ అన్న విషయాన్ని పరోక్షంగా అభిమానులకు పంపినట్లు అవుతుంది. అదే జరిగితే సోషల్ మీడియాలో మరోసారి ‘వైసీపీ Vs పవన్ ఫ్యాన్స్’ తెరలేపినట్లే!



