అమెరికాలోని తానా సభలకు ముఖ్యఅతిధిగా వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. “ఎన్నికల్లో జనసేన పార్టీ అపజయం నన్ను మరింత బలోపేతం చేసింది. నేను చాలా ఆలోచించిన తర్వాతే జనసేన పార్టీ పెట్టా. జనసేన పార్టీ ఓటమిని నేను అర్థం చేసుకుని బయటకు రావడానికి 15 నిమిషాలు మాత్రమే పట్టింది,” అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే తనను జనసేన ఓటమి బాధ కలిగించలేదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు.
“ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు.. ఓటమికి నేను ఎందుకు భయపడడం లేదంటే.. స్కామ్లు చేశో.. ద్రోహం చేశో రాజకీయాల్లోకి రాలేదు.. విలువల కోసం వచ్చా.. అది నాకు ఓటమి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా. సక్సెస్ కోసం నేను ఎంతో ఓపికగా ఎదురుచూడగలను… సినిమాల విషయంలో చెప్పాలంటే.. నాకు ఖుషి తర్వాత గబ్బర్సింగ్ సినిమా విజయం సాధించడానికి చాలా సమయం పట్టింది,” అని చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేనాని మాట్లాడుతున్నంత సేపు అక్కడ భారీ రెస్పాన్స్ వచ్చింది.
తన స్పీచ్ లో ఆయన జగన్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. “విలువలను నిలబెట్టినంత కాలం గర్వంగా తలెత్తుకొని నిలబడతా.. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులే ఇబ్బంది పడనప్పుడు.. ఓ సత్యాన్ని మాట్లాడే నాకెందుకు ఇబ్బంది,” అని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇటీవలే జరిగిన ఎన్నికలలో జనసేనకు ఒకటే సీటు వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం తెలిసిందే.



