2019 ఎన్నికల్లో “జనసేన” పోటీ… సాధించి తీరుతా… పవన్ కల్యాణ్!

Pawan Kalyan Janasena will contest in 2019 electionఅభిమానులంతా ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న తీపి కబురును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందించారు. రాజకీయ పార్టీ పెట్టి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత పోటీ చేయకుండా తెలుగుదేశం – బిజెపి కూటమికి మద్దతు తెలిపి అంతే సంచలనమయ్యారు. అయితే ఇది గడిచి రెండు సంవత్సరాలు కావస్తున్న రాజకీయ పరమైన విధివిధానాలకు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో అసలు ‘జనసేన’ ఉంటుందా… లేక ఏ ఇతర పార్టీలోనైనా కలిసిపోతుందా అన్న ఊహాగానాలు చెలరేగాయి.

అయితే ఆ పుకార్లకు ‘శుభంకార్డు’ వేస్తూ 2019 ఎన్నికల్లో ‘జనసేన’ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు, విభజన సమస్యల మీద పోరాడుతానని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిలబడతానని స్పష్టం చేశారు. పోరాటంలో దిగితే ఖచ్చితంగా సాధించి తీరుతానన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తపరిచారు. ‘ప్రత్యేక హోదా’పై తానేం చేయాలో తెలుసని, దానిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నానని చెప్పారు. ‘విత్తనం’ వేయగానే పళ్లు, కాయలు రావని రాజకీయాల్లో ఏం చేసినా చెప్పి చేస్తానని, ప్రజల గొంతు వినిపించాలనేదే తన తపనగా పవన్ చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో తాను విజయం సాధిస్తానా? లేదా? అన్నది తరువాత… అయితే తన ప్రయత్నలోపం లేకుండా శాయశక్తులా పోరాటం మాత్రం చేస్తానని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ADVERTISEMENT

ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని… ఈ విధానం ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉందని… ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు తానే నాంది పలుకుతానని అన్నారు. ‘భావదారిద్ర్యం’ తనకు నచ్చదని,, ఉన్నత ఆశయాలు లేకపోతే అది ‘దౌర్భాగ్యం’ కిందే లెక్క అని, రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి చాలా బలమైన కారణం ఉండాలని, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందేనని, సిద్ధాంతాలు లేని నాయకులుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు.

రాష్ట్ర విభజన అన్నప్పుడు తాను చాలా బాధపడ్డానని, అప్పట్లో ప్రజల తరపున మాట్లాడే నాథుడు కనపడలేదని, రాజకీయ నాయకులు, పాలకులు చేసిన తప్పులకు ప్రజలను బాధ్యులను చేసి విభజన చేశారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటు తనానికి బాధ్యత రాజకీయ నాయకులదైతే దానిని ప్రజలను బాధ్యులుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రజల్లో మనిషినేనని, అందుకే బాధపడ్డానని, విభజన సందర్భంగా ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాన నిస్వార్ధంగా మాట్లడలేదని గుర్తు చేసుకున్నారు.

“తాను చెప్పిన ఏ మాటా మర్చిపోలేదని, గొడవ పెట్టుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని, తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయని వాటిని వెల్లడించే సమయం కోసం చూస్తున్నానని” రాజకీయాల గురించి పవన్ చెప్పిన సంగతులు ఇటు అభిమాన వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories