ఏమీ చేయనివారికి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వస్తోందే!

Pemmasani on Bhogapuram Airport

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమరావతి, పోలవరం భోగాపురం విమానాశ్రయం, పలు పోర్టులు నిర్మిస్తోంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను, ఐటి కంపెనీలు తెస్తోంది. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలకు, ప్రతిపక్షానికి సంజాయిషీ ఇచ్చుకోవడం సహజం. కానీ కేవలం రెండేళ్ళలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఇంత వేగంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఏమీ చేయని వైసీపీకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం విచిత్రం.. దౌర్భాగ్యం కూడా.

‘మా వల్లనే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయిందని’ వైసీపీ చేసుకుంటున్న ప్రచారానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమే ఇందుకు తాజా ఉదాహరణ.

ADVERTISEMENT

“నాడు సిఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నప్పుడే అంటే 2015లోనే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీనికి టెండర్లు పిలిచినప్పుడు జీఎంఆర్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. మరో 5-10 ఏళ్ళ వరకు దీనిపై ఎటువంటి ఆదాయం రాదని తెలిసి ఉన్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి చెప్పిన విషయాలు, ఆయనపై నమ్మకంతో దీనిని నిర్మించేందుకు జీఎంఆర్ ముందుకు వచ్చింది.

అప్పుడే దీనికి 2,700 ఎకరాలు సేకరించాలని అనుకున్నారు. దానిలో రన్-వేకు అవసరమైన 500 ఎకరాలు తప్ప మిగిలిన భూమిని ప్రభుత్వం సేకరించింది.

అలాగే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా సాధించారు. ఈ పనులు పూర్తయిన తర్వాతే సిఎం చంద్రబాబు నాయుడు 2019లో శంకుస్థాపన చేశారు.

నాడు సిఎం చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి భూసేకరణ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డే అడ్డుపడ్డారు. మిగిలిన 500 ఎకరాలు ఇవ్వకుండా స్థానిక రైతులను రెచ్చగొట్టారు. వారి పేరుతో కోర్టులో కేసులు కూడా వేయించారు.

నాడు విమానాశ్రయానికి అడ్డుపడిన జగన్‌, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అక్కడే కట్టేందుకు సిద్ధమయ్యారు. మా ప్రభుత్వ హయంలో ఖరారు చేసిన టెండర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందనే అనుమానంతో మళ్ళీ పిలిస్తే అప్పుడూ జీఎంఆర్ సంస్థే దానిని దక్కించుకుంది!

కానీ 2019 నుంచి 2023 వరకు జగన్‌ ప్రభుత్వం విమానాశ్రయం పనులు మొదలు పెట్టలేదు. నాడు ఇవ్వవద్దని అడ్డుకున్న వైసీపీ నేతలే రైతులను ఒప్పించి మిగిలిన 500 ఎకరాలు సేకరించి పనులు మొదలుపెట్టిన మాట వాస్తవం. అయితే సుమారు నాలుగేళ్ళ పాటు పనులు నిలిచిపోవడానికి కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే.

అసలు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన మాది. టెండర్లు మొదలు 80 శాతం భూసేకరణ చేసింది మేమే. మళ్ళీ వాటిని ఇప్పుడు పూర్తిచేసింది మా ప్రభుత్వమే! అదిప్పుడు పూర్తయిన తర్వాత దాని క్రెడిట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆరాటపడుతున్నారు?” అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories