బందర్ లడ్డూని పళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తున్నందుకు… థాంక్యూ జగన్‌!

Perni Kittu Kollu Ravindra

రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు, ప్రచార సమయంలో ఎన్ని గొప్పలు పోయినప్పటికీ వారికి ఏ పార్టీ గెలుస్తుందో… ఏది ఓడిపోబోతుందో ముందే అవగాహన ఉంటుంది.

ADVERTISEMENT

ఈసారి ఎన్నికలలో మచిలీపట్నంలో వైసీపి ఓడిపోబోతోందని ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని చాలా ముందే పసిగట్టిన్నట్లున్నారు.

అందుకే ఈసారి తనకు బదులు తన కుమారుడు పేర్ని కిట్టుని రాజకీయ ఆరంగ్రేటం చేయిద్దామనుకున్నారు. బహుశః జగన్‌కు కూడా ఈసారి ‘బందరు లడ్డూ’ చేజారిపోబోతోందని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే పేర్ని కిట్టుకి టికెట్‌ ఖరారు చేసేశారు.

మచిలీపట్నంలో ఈసారి వైసీపికి ఎదురుగాలి వీస్తోంది కిట్టూకి టికెట్‌ ఇస్తే ఓడిపోయినా, తనకి, పార్టీకి, పేర్ని నానికి కూడా ఇబ్బంది ఉండదని జగన్‌ భావించి ఉండవచ్చు. కనుక కిట్టూకి టికెట్‌ ఇచ్చి కొడుకుని గెలిపించుకునే బాధ్యత పేర్ని నాని మీద పెడితే ఆయనే సర్వశక్తులు ఒడ్డి పోరాడుతారని జగన్‌ భావించి ఉండవచ్చు.

పేర్ని కిట్టు గురించి చెప్పుకోవాలంటే ఆయనకి పెద్దగా రాజకీయ అనుభవం, ప్రజలతో సంబంధాలు, సొంత ఇమేజ్‌ కూడా లేవు. కనుక చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు తండ్రి పేరు చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగవలసి ఉంటుంది. పైగా ఈసారి వైసీపికి ఎదురుగాలి వీస్తోంది.

ఇదీగాక పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు, అధినేతని ప్రసన్నం చేసుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ని నోటికి వచ్చిన్నట్లు విమర్శించారు. దాంతో మచిలీపట్నం ఎక్కువ జనాభా గల కాపులని పేర్ని నాని దూరం చేసుకున్నారు. ఇప్పుడు కొడుకుకి మద్దతు ఇమ్మంటే ఇవ్వరు.

టిడిపి, జనసేనలు పొత్తుపెట్టుకోవడంతో వారందరూ ఇప్పుడు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. పొత్తులలో భాగంగా మచిలీపట్నం సీటు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కొల్లు రవీంద్రకు లభించింది. ఆయన 2014లో భారీ మెజార్టీతో పేర్ని నానిపై గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2019లో వైసీపి ప్రభంజనంలో పేర్ని నాని చేతిలో ఓడిపోయారు.

ఇప్పుడు టిడిపి, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దిగుతుండటంతో మచిలీపట్నంలో కాపులందరూ గంపగుత్తగా కొల్లు రవీంద్రకే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇదీగాక కొల్లు రవీంద్ర చాలా ఏళ్ళుగా ‘స్పర్శ ఫౌండేషన్’ పేరుతో మచిలీపట్నంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలో ఆయనకు చాలా మంచి పేరుంది.

గణాంకాలు కూడా అవే చెపుతున్నాయి. 2009 ఎన్నికలలో పేర్ని నాని మచిలీపట్నం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తే 48,580 ఓట్లు (37.87 శాతం) సాధించి గెలిచారు. అప్పుడు టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన కొల్లు రవీంద్రకు 37,181 ఓట్లు (28.98 శాతం) లభించగా, రాజారాజ్యం అబ్యర్ధి వేదవ్యాస్ బూరగడ్డకి 34,124 (27.38 శాతం) ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలలో కొల్లు రవీంద్రకు 75,209 (53.43 శాతం), పేర్ని నానికి 59,403 (42.2 శాతం) లభించాయి.

2019లో పేర్ని నానికి పేర్ని నానికి 66,141 (44.36 శాతం), కొల్లు రవీంద్రకు 60,20 (40.44 శాతం) జనసేన అభ్యర్ధి బండి రామకృష్ణకు 18,807 ఓట్లు (8.86 శాతం) లభించాయి.

గత ఎన్నికలలో వైసీపి ప్రభంజనంలో ఉన్నప్పటి లెక్కలను పరిగణలోకి తీసుకున్నా ఈసారి టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నందున టిడిపి, జనసేనల ఓటింగ్ శాతం కలుపుకుంటే కొల్లు రవీంద్రకు కనీసం 53.22 శాతం లభించడం ఖాయమే. ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం, వైసీపి వ్యతిరేకత రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక కొల్లు రవీంద్రకు మరో 4-5 శాతం ఎక్కువే రావచ్చు. భారీ మెజార్టీతో విజయం సాధించడం కూడా ఖాయమే.

ఈ నేపధ్యంలో జగన్మోహన్‌ రెడ్డి మచిలీపట్నం అభ్యర్ధిగా పేర్ని కిట్టుని ఖరారు చేయడంతోనే కొల్లు రవీంద్ర సగం విజయం ముందే ఖాయం అయిపోయింది. కనుక బందర్ లడ్డూని బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్నందుకు కొల్లు రవీంద్ర కూడా థాంక్యూ సిఎం సార్ అంటూ జగన్మోహన్‌ రెడ్డికి, పేర్ని నానికి కృతజ్ఞతలు తెలుపుకుంటే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories