సిఎం చంద్రబాబు నాయుడు నేడు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ప్రారంభోత్సవం చేయడంపై వైసీపీ అప్పుడే అక్కసు వెళ్ళగక్కడం మొదలుపెట్టింది. ముందుగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మొదలుపెట్టారు. కానీ అయన ప్రశ్నలు చంద్రబాబు నాయుడుని కాక తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
“అసలు అమరావతి, సీడ్ యాక్సిస్ రోడ్ మొదలు పెట్టి ఎన్నేళ్ళయింది. దానికి ఎందుకు ఇంతకాలం పట్టింది? ఒక రోడ్డు, బ్రిడ్జి నిర్మించి అదేదో గొప్ప ఘనకార్యమన్నట్లు చెప్పుకుంటున్నారు. అమరావతి పేరుతో భారీగా దోచుకుంటున్నారు.
ఇది సరిపోదన్నట్లు ఇంకా అమరావతికి మరో రెండు మూడు దశలున్నాయని చెప్పుకుంటున్నారు. అమరావతికి రైతుల భూములు కావాలి కానీ రైతులను పట్టించుకోరు. అసలు అమరావతి రైతులపై చంద్రబాబు నాయుడుకి కాస్తయినా ప్రేముందా?” అని పేర్ని నాని ప్రశ్నించారు.
అమరావతికి ఎందుకు ఇంతకాలం పట్టిందని అయన చంద్రబాబు నాయుడుని కాదు తమ అధినేత జగన్మోహన్ రెడ్డినే అడగాలి. కానీ పేర్ని నాని కూడా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా, పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు కనుక అమరావతి ఎందుకు ఆలస్యమైందో ఆయనకి కూడా బాగా తెలుసు.
అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నది ఎవరో కూడా పేర్ని నానికి బాగా తెలుసు. 65 సెంట్ల భూవివాదం ఎన్నేళ్ళు హైకోర్టులో నలిగిందో ఆయనకి తెలుసు. హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 24 గంటలలోపే అక్కడ రోడ్ నిర్మాణ పనులు జరిగిన సంగతి ఆయనకు బాగా తెలుసు.
అమరావతి రైతులపై ప్రేముందా? అని చంద్రబాబు నాయుడుని కాదు జగన్మోహన్ రెడ్డినే పేర్ని నాని నిలదీస్తునట్లుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులను ఎంతగా వేధించారో, అవమానించారో, అవహేళన చేశారో పేర్ని నానికి తెలియదా? అయినా అమరావతి రైతులపై ప్రేముందా? అని సిఎం చంద్రబాబు నాయుడుని అడుగుతున్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీయే గెలిచి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని బల్లగుద్ది వాదిస్తున్నప్పుడు, మావిగన్ రాజధానిగా చేసుకొని పాలిస్తామని చెప్పుకుంటున్నప్పుడు అమరావతి భవిష్యత్ నిర్మాణాల గురించి సిఎం చంద్రబాబు నాయుడు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ వాటి గురించి కూడా పేర్ని నాని మాట్లాడుతున్నారంటే, మళ్ళీ ఎన్నటికీ వైసీపీ గెలిచి అధికారంలోకి రాలేదని భావిస్తునట్లే కదా?




