పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణలపై నోరుమెదపని కేంద్రం.. ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ని అనుమానిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం ఇస్తున్న నిధులు వేరే పనులకు మరీ ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించకుండా ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని జల వనరుల శాఖను ఆదేశించింది. తాజాగా…కేంద్రం పనులు సాగుతున్న తీరుపై తాజాగా నిఘా పెట్టింది.
ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పీపీఏ అధికారులు ఇటీవలి కాలంలో తరచూ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి పనులు పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్, కాంట్రాక్టు సంస్థల అధికారులతో సమీక్షలు జరుపుతూ.. లోటుపాట్లు ఉంటే తగిన సూచనలు చేస్తున్నారు. అయతే ప్రాజెక్ట్ అంచనా వ్యయం సవరణలపై నోరుమెదపకుండా ఇటువంటి పరిశీలనలు ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెదవి విరుస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… ప్రాజెక్ట్ కు సంబంధించిన భూసేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించిన నిధుల మీద క్లారిటీ లేదు. ఈ విషయం పై కేంద్రం క్లియర్ గా చెప్పకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగలేకపోవడం గమనార్హం. అందువల్ల ప్రాజెక్ట్ మీద నీలినీడలు అలముకున్నాయి. మరోవైపు… డిసెంబరు మొదటివారంలో పోలవరం ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం ప్రత్యేక ఖాతాను తెరచినప్పటికీ.. అందులో కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులను జమచేయలేదు.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాలువలతో పాటుగా స్పిల్ వే, స్పిల్ ఛానెల్ నిర్మాణాలు కొలిక్కి వస్తున్నాయి. ఇక కీలకమైన మెయిన్ డ్యామ్ నిర్మాణం కోసం రెండు కాఫర్ డ్యాములు కూడా నిర్మించారు. దాంతో నిర్మాణ పనులు మొత్తం 71.54 శాతం పూర్తయినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వం మారకా పనులు పూర్తిగా నత్తనడకన నడుస్తున్నాయి.





