యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన తొలి పాట ‘సైకో సయ్యా’ పూర్తి వీడియో నిరాశపరచింది. దీనితో నిర్మాతలు తరువాతి ప్రమోషన్లు మరింత కట్టుదిట్టంగా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఒక్క ఐటమ్ సాంగ్ మినహా పూర్తి అయ్యిందని సమాచారం.
మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ పాట గురించి టీం డైలమా లో ఉందట. ఐటమ్ సాంగ్ ఉంటే మాస్ ఆడియన్స్ కు ఊపు వస్తుందని ఒక అభిప్రాయం ఉండగా, దాని వల్ల నిడివి పెరుగుతుందని టీంలోనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయట. ఎటూ తేల్చుకోలేక పాట షూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారంట. ఒకవేళ నిడివి సరిపోతే పూర్తి పాట సినిమాలో ఉంటుంది. లేకపోతే కొంత పార్టు కత్తిరిస్తారట. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ పాటలో చిందులు వెయ్యనున్నట్లు సమాచారం.
సాహో చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. దక్షిణాదిన ఇదే ఆమె మొదటి చిత్రం. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతుంది. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.’ బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ట్రేడ్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది గనుక హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.



