తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ పేరు మెల్లిమెల్లిగా అస్తమిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గతంలో తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఆంధ్రా రాజకీయాలలో కూడా నిత్యం మారుమోగే కేసీఆర్ పేరు ఇప్పుడు మూగబోయింది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలోనే కాదు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ పేరు తలంపు లేకుండా పోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, పార్టీ ముఖ్య నాయకుడు గా హరీష్ రావు కేంద్రంగానే బిఆర్ఎస్ రాజకీయం నడుస్తుంది.
అటు ప్రత్యర్థి కాంగ్రెస్ తప్ప తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ పేరు ఉచ్చరించేవారే కరువయ్యారు. ఒకపక్క కవిత తన టిఆర్ఎస్ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్ళుందుకు చాల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం పై ప్రజా పోరాటాల పేరిట, ప్రభుత్వ నిర్ణయాల మీద నిరసనలతో నిత్యం మీడియాలో నానుతున్నారు.
ఇక తనకు సంబంధం లేకుండానే ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాలలో తనకంటూ కొంత స్పేస్ సంపాధించుకున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు మెట్రో వివాదంతో బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరు కూడా మీడియాలో గట్టిగానే వినపడింది.
ఇక బండి భగీరథ్ వివాదంతో బండి సంజయ్ కి అవసరానికి మించిన మీడియా కవరేజ్ లభించింది, దానితో తెలంగాణ రాజకీయాలలో బండి పేరు విస్తృతంగా ప్రచారం లోకి వచ్చింది. చివరికి రాజకీయ పార్టీలకు సంబంధం లేని ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి కొన్ని రోజుల పాటు తెలంగాణ రాజకీయాలలో తన హావ కొనసాగించారు.
కానీ పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం గా సేవలందించిన కేసీఆర్ మాత్రం కేటీఆర్ చెప్పినట్టు గోడకు తగిలించిన తుపాకీ మాదిరి బిఆర్ఎస్ పార్టీకి షో పీస్ గా మారిపోయారు, కేసీఆర్ ని ముందుపెట్టి కేసీఆర్ లెన్ని బిఆర్ఎస్ తో ఆ పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారు.
తెలంగాణలో అనేక అంశాల మధ్య అటు అధికార ఇటు ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అయినా కూడా ఎక్కడ కేసీఆర్ తన మౌన దీక్షకు విరమణ ప్రకటించడం లేదు, క్షేత్ర స్థాయి రాజకీయాలలోకి అడుగుపెట్టడం లేదు. కాళేశ్వరం నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల వరకు చర్చ కోసం మాజీ సీఎం అసెంబ్లీ కి రావాలంటూ ప్రస్తుత సీఎం రేవంత్ కేసీఆర్ కి సవాల్ విసురుతున్నారు.
అయినా కేసీఆర్ జాడ కానరావడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలలో మారుమోగిన ఈ కేసీఆర్ అనే పేరు ఇప్పుడు బిఆర్ఎస్ ఓటమితో, కేసీఆర్ అజ్ఞాతంలో మూగబోతుంది. సొంత కుమార్త కవితే కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నా, కేసీఆర్ ని మరమనిషి అంటూ దూషిస్తున్నా కేసీఆర్ తన గొంతు విప్పలేకపోతున్నారు.
గత పదేళ్లు తన అధికారంతో ప్రత్యర్థుల నోటికి తాళం వేసిన కేసీఆర్ ఇప్పుడు అదే తాళం తననోటికి వేసుకోవడం విధిరాతే అనాలేమో. అలాగే తన పదేళ్ల పాలనతో తెలంగాణలో ఎందరో రాజకీయ నాయకుల హవాను సమాధి చేసిన కేసీఆర్ ఇప్పుడు తన హవా కొనసాగించలేకపోవడం దేవుడిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలేమో…!




