‘చిన్నారి పెళ్లికూతురు’ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ రాజ్ సింగ్ ను ముంబైలోని శ్రీసాయి హాస్పిటల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం చేస్తోందని ప్రత్యూష తల్లిదండ్రులు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు నుంచి రాహుల్ రాజ్ ను కాపాడేందుకు ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు కూడా తీసుకుందని మెడికల్ కౌన్సిల్ కు చేసిన ఫిర్యాదు మెయిల్ లో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన డాక్టర్ గోయల్… ప్రత్యూష తల్లితండ్రులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘తాము రాహుల్ కు ఎలాంటి సహాయం చేయడం లేదని, మానసిక రుగ్మతతో బాధపడుతున్న రాహుల్ ను తమ ఆసుపత్రిలో చేర్చుకుని సైకియాట్రిస్ట్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లతో చికిత్స ఇప్పిస్తున్నామని, రాహుల్ ఆరోగ్య పరిస్థితిపై రోజు విడిచి రోజు పోలీసులకు నివేదిక ఇచ్చామని తెలిపారు. కుమార్తెను కోల్పోయిన వారిపై సానుభూతి ఉంది కానీ, ఆసుపత్రికి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు.





