దర్శకుడు పూరి జగన్నాధ్ ఇటీవలే మహేష్ బాబుపై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. హిట్స్ లో ఉంటే తప్ప మహేష్ బాబు తనతో సినిమా చెయ్యడని ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాకా అవకాశం ఇచ్చినా ఒప్పుకోవడానికి తన ఆత్మాభిమానం ఒప్పుకోదన్నట్టు పూరి చెప్పాడు. దీనితో వీరిద్దరి కంబినేషన్ లో 2016లో ప్రకటించిన జనగణమణ ఆగిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. ఎందుకనో అప్పటి నుండీ ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులకు ఎనలేని ఆసక్తి ఉంది. పూరి ఎక్కడకి వెళ్లినా ఈ ప్రాజెక్టు ఎప్పుడు అని అందరు అడుగుతూ ఉంటారట.
దీనితో జనగణమణ స్క్రిప్టును విజయ్ దేవరకొండ దగ్గరకు తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నాడట పూరి. అయితే ఈ యువకథానాయకుడు దానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మహేష్ ను కాదనుకుని వెళ్లిన స్క్రిప్ట్ చేస్తే ఆ ప్రాజెక్టు మీద నెగటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. మహేష్ బాబు అభిమానులు సహాయనిరాకరణ చేస్తారు. ఈ విషయాలన్నీ పట్టించుకుంటే మాత్రం విజయ్ ఈ ప్రాజెక్టు చెయ్యడు. ఒకవేళ అతను ఒప్పుకుంటే వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
చాలా ఏళ్లగా సరైన హిట్ లేని పూరి ఇటీవలే విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ కొట్టాడు. మొదటి వారాంతంలోనే సినిమా లాభాల బాట పట్టింది. 17 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కనీసం రేటింపు రాబడుతుందని విశ్లేషకుల అంచనా. ఈ విజయం పూరికి ఎంతో ఊరటనిచ్చింది. అయితే చాలా మంది మాత్రం ఇప్పటికీ పూరిలో మునిపటి పూరీని చూడలేదు అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ క్రెడిట్ మొత్తం రామ్ కే వెళ్లిపోయింది. మార్కెట్లో సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవటం కూడా ఈ సినిమా కు బాగా ప్లస్ అయ్యింది. కాబట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరి ఇస్ బ్యాక్ అనే రేంజ్ లో లేదు అంటున్నారు.



