సిల్వర్ స్క్రీన్ పై ‘ఆరడుగుల ఆజానుబాహుడు’ ఆయన కనిపిస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు… అనే మాట స్వర్గీయ నందమూరి తారక రామారావు వెండితెరపై శ్రీకృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో కనిపించినపుడు ప్రతి ఒక్కరూ చెప్పిన సందర్భం. అయితే అదే మాటను తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినీ నిర్మాత పివిపి ప్రస్తావించారు. ఆనాడూ ఎన్టీఆర్ గారిని చూడడానికి రెండు కళ్ళు ఎలా సరిపోలేదో, ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ ను చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవని ఉద్ఘాటించారు.
మహేష్ తో మున్ముందు మరిన్ని సినిమాలు చేయాలనీ ఉందని, చేతిలో కధలు కూడా సిద్ధంగా ఉన్నాయని, త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పిన పివిపి, మా సంస్థ నుండి గర్వపడే సినిమాలే వస్తాయన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగేలా కష్టపడతామని, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నాణ్యతతో అందించడమే లక్ష్యమని, ఫలితం దైవాదీనమని, విజయవాడ నుండి అమెరికా వెళ్లిన తానూ మధ్యతరగతి జీవితం గురించి బాగా తెలుసని, ‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసి ధియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడు మనసులో ఒక ఉత్సాహం కలిగేలా అయితే సినిమా ఉంటుందని పివిపి తన అనుభూతులను పంచుకున్నారు.





