తెలంగాణ కాంగ్రెస్లో సిఎం రేవంత్ రెడ్డికి పంటి కింద రాయిలా మారిన వ్యక్తి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మొదట తనకు హోంశాఖ కావాలన్నారు. ఆ తర్వాత ఏ శాఖ అయినా పర్వాలేదు మంత్రి పదవి ఇస్తే సర్దుకుపోతానన్నారు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కనుక అవకాశం చిక్కినపుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి స్పూర్తితో రాజగోపాల్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకోవాలనే ఆలోచనలు చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి.కానీ ధైర్యం చాలినట్లు లేదు.
అందుకే తాను రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. అంటే.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయనని చెపుతున్నారన్న మాట.
సిఎం రేవంత్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా ఎలాగూ పట్టించుకోవడం లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ మాటలను వల్లెవేస్తూ, “బయట నుంచి వచ్చిన వ్యక్తులు (రేవంత్ రెడ్డి) వలన పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉండి ఉంటే నేడు ఇలా మాట్లాడేవారా? అంటే కాదనే చెప్పాలి. మంత్రి పదవి ఇస్తే, ఆయన కూడా మిగిలిన మంత్రుల్లాగే సిఎం రేవంత్ రెడ్డికి విధేయంగా ఉండేవారు. కానీ ఇవ్వలేదు కనుక సిఎం రేవంత్ రెడ్డి ‘బయటి వ్యక్తి’గా కనిపిస్తున్నారనుకోవచ్చు.
కానీ ఆ బయట వ్యక్తి పార్టీలోకి రాక ముందు, కొమ్ములు తిరిగిన ఇలాంటి ఒరిజినల్ అండ్ సీనియర్ నేతలందరూ పదేళ్ళలో తమ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు?ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ పగ్గాలు చేపట్టకపోయుంటే నేడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగేదా?
బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తెస్తే, ఇప్పుడు అందరికీ మంత్రి పదవులపై రాజకీయ వారసత్వ హక్కు ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. అందువల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడుతున్నారనుకోవచ్చు.




