సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు. గత పది రోజులుగా రజనీకాంత్ నగరంలోనే ఉంటున్నారు.
అయితే చిత్ర యూనిట్లో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రజనీకాంత్ కూడా మూడు రోజులపాటు క్వారంటైన్లో ఉన్నారు. ఆయన ఈ నెల 22వ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ అని వచ్చింది. అధిక రక్తపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, తాజా కోవిడ్ పరీక్ష గురించి మాత్రం అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రస్తావించలేదు.
ఇంకో ఐదు రోజులలో రజినీకాంత్ తన కొత్త రాజకీయ ప్రకటన చెయ్యాల్సి ఉండగా రజినీ అనారోగ్యానికి గురికావడం గమనార్హం. రజినీకాంత్ కు మామూలుగానే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవి. 2021 వేసవి లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పట్టుమని ఆరు నెలల సమయం కూడా లేదు.
ఇటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజినీ ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళగలరు అనేది అనుమానమే. గతంలోనే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రజినీ రాజకీయాలకు దూరంగా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే అభిమానుల ఒత్తిడితో మనసు మార్చుకుని పార్టీ ప్రకటిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇలా జరిగింది. దానితో రజినీకాంత్ ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి.





