నెమ్మదిగా బీజేపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల వేళ టీడీపీని ఓడించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ,మాట్లాడుతూ… రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు.
జాతీయ పార్టీ భాజపాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఓ ప్రాంతీయ పార్టీ వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు చూశారని.. అందుకే మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమిచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని ఆయన ఆరోపించారు. 2024 నాటికి ఏపీలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. గ్రామగ్రామాన భాజపాను పటిష్ఠం చేయాలని.. సభ్యత్వ నమోదును దీనికి సాధనంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
టీడీపీలో ఓడిపోయిన నేతలను పార్టీలోకి చేర్చుకుని బలపడే ప్రయత్నంలో ఉంది బీజేపీ. ఆ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ ను కూడా విమర్శించి కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ని వాడుకుని వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా మారాలని బీజేపీ భావిస్తుంది. దీనికోసమే 2014లో కలిసి పోటీ చేసిన చంద్రబాబుని ఇబ్బంది పెట్టి ఆ తరువాత ఆయనను గద్దె దించారు. ఈ క్రమంలో త్వరలో జగన్ కూడా తిప్పలు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



